ఆటంకాలు సృష్టించినా వినాయకుని దీవెనలతో అధిగమిస్తున్నం

ఆటంకాలు సృష్టించినా వినాయకుని దీవెనలతో అధిగమిస్తున్నం

వినాయక చవితి పండుగ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సకల శాస్త్రాలకు అధిపతిగా, బుద్ధికి, జ్ఞానానికి ఆరాధ్యుడిగా, ఆటంకాలను తొలగించే విఘ్నేశ్వరుడిగా, భక్తి శ్రద్ధలతో హిందువులు గణనాథున్ని ఆరాధిస్తారని తెలిపారు. జ్ఞానం, లక్ష్య సాధన, నైతిక విలువలు, ప్రకృతి పరిరక్షణ వంటి సుగుణాలను వినాయక చవితి పండుగ మనకు నేర్పుతుందన్నారు. గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రజలంతా శాంతి సౌభ్రాతృత్వాలు వెల్లి విరిసేలా, ఆనందంతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఎవరెన్ని ఆటంకాలు సృష్టించినా వాటిని వినాయకుని దీవెనలతో అధిగమిస్తూ, సకల జన సంక్షేమమే లక్ష్యంగా ముందుకెళుతామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని తెలిపారు. తలపెట్టిన కార్యాలు నిర్విఘ్నంగా కొనసాగేలా, సుఖ శాంతులతో జీవించేలా, దేశ ప్రజలందరికీ ఆ ఏకదంతుని దీవెనలు అందాలని ప్రార్థించారు.

దేశ వ్యాప్తంగా వినాయక చవితి శోభ వచ్చేసింది. గల్లీ గల్లీల్లో వినాయక మంటపాలను ఏర్పాటు చేశారు. ఈ పండుగ వచ్చిదంటే.. ముందుగా మెదిలేది... ఖైరతాబాద్ గణపతి. భారీ ఆకారంలో దర్శనమిచ్చే ఈ గణపతిని చూడటానికి ఎక్కడి నుంచో ఇక్కడకు వస్తుంటారు. బుధవారం వినాయక చవితి సందర్భంగా.. మంగళవారం నుంచే భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ ఏడాది శ్రీ పంచముఖ మహాలక్ష్మీ గణపతిగా దర్శనం ఇస్తున్నారు. ప్రత్యేకించి 50 అడుగుల మట్టి గణేష్ ను ఏర్పాటు చేశారు. గణనాథుడికి ఇరువైపులా త్రిశక్తి మహా గాయత్రి, షణ్ముఖ సుబ్రమణ్య స్వామి దర్శనమిస్తున్నారు.