
వేములవాడ రూరల్, వెలుగు: వేములవాడలో రాజన్న ఆలయ అనుబంధంగా కొత్త గోశాల నిర్మాణానికి స్థల సేకరణ చేపట్టాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఖతార్ పర్యటన ముగించుకొని ఆదివారం హైదరాబాద్ వచ్చిన ఆది శ్రీనివాస్.. సీఎంను కలిసారు. ఈ సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయంలో జరిగే అభివృద్ధి, గోశాలలో జరిగిన పలు అంశాలపై సీఎం ఆరా తీసినట్లు విప్ తెలిపారు.
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి ఎంతో ప్రీతికరమైన రాజన్న కోడెల సంరక్షణ కోసం అత్యాధునిక వసతులతో, సువిశాలమైన కొత్త గోశాల నిర్మాణానికి అవసరమైన స్థల సేకరణ చేపట్టాలని సీఎం సూచించారు. ఇటీవల రూ.200 కోట్లతో వేములవాడ నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ మంజూరు చేయడం, ఏఐసీసీ ప్రకటించిన కమిటీల్లో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ, డిలీమిటేషన్ కమిటీ సభ్యునిగా తనను నియమించడంపై సీఎంకు ఆద శ్రీనివాస్ ప్రత్యేక కృత్ఞతలు తెలిపారు.