
- పగటిపూట విద్యుత్ దుర్వినియోగం కాకుండా పక్కాగా పర్యవేక్షణ
- అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం
- ప్రతి పోల్ సర్వే చేసి.. ఎన్ని ఎల్ఈడీ లైట్లు అవసరమో లెక్క తీయండి
- కొత్త లైట్ల ఏర్పాటుకు పేరొందిన కంపెనీలను టెండర్లకు ఆహ్వానించండి
- గ్రామస్థాయిలో పర్యవేక్షణ సర్పంచులకే.. జిల్లాస్థాయిలో అదనపు కలెక్టర్లకు
- స్ట్రీట్ లైట్లు, కంట్రోల్ బాక్స్ల పనితీరు పర్యవేక్షణకు ప్రత్యేక వ్యవస్థ
- హైదరాబాద్ ఐఐటీ లాంటి సంస్థలతో థర్డ్ పార్టీ ఆడిట్ చేయించాలని ఆదేశం
- మున్సిపల్, పంచాయతీరాజ్, జీహెచ్ఎంసీ ఆఫీసర్లతో రివ్యూ
హైదరాబాద్, వెలుగు:రాష్ట్రంలో అన్ని ఎల్ఈడీ స్ట్రీట్లైట్లను హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్తో అనుసంధానం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. గ్రామాల్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న స్ట్రీట్లైట్లు వెలుగుతున్నాయా? లేదా?, కొత్తగా ఎన్ని అవసరమున్నాయి? అనేది పక్కాగా అంచనా వేయాలని, ప్రతి పోల్ సర్వే చేయాలని సూచించారు. రాత్రిపూట ఎల్ఈడీ లైట్లు పనిచేయడంతోపాటు పగటిపూట దుర్వినియోగం కాకుండా పర్యవేక్షణ ఉండాలని, అన్ని గ్రామాల ఎల్ఈడీ డ్యాష్ బోర్డు మండల స్థాయిలో ఎంపీడీవో పర్యవేక్షణలో ఉండాలని చెప్పారు. జిల్లాలో అడిషనల్ కలెక్టర్కు ఈ బాధ్యతలు అప్పగించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ఎల్ఈడీ స్ట్రీట్ లైట్ల ఏర్పాటు, నిర్వహణకు టెండర్లు పిలవాలని సూచించారు. ఎల్ఈడీ లైట్ల తయారీలో పేరొందిన కంపెనీలను ఆహ్వానించాలని, ఏడేండ్ల పాటు నిర్వహణ బాధ్యతలు కంపెనీలకు అప్పగించాలని అన్నారు. నిర్వహణ పక్కాగా ఉండేందుకు వీలుగా టెండర్ నిబంధనలను రూపొందించుకోవాలని ఆదేశించారు. సోమవారం హైదరాబాద్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో మున్సిపల్, పంచాయతీరాజ్, జీహెచ్ఎంసీ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల పరిధిలో 16.16 లక్షల ఎల్ఈడీ వీధి దీపాలున్నాయని, వరంగల్, నల్గొండ, జనగాం, నారాయణపేట జిల్లాల్లో ఎల్ఈడీ లైట్ల కాంట్రాక్టు ఏజెన్సీ అధ్వర్యంలో ఉందని అధికారులు వివరించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 5.50 లక్షల ఎల్ఈడీ లైట్లు ఉన్నాయని, ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న కోర్ అర్బన్ సిటీని కూడా కలిపితే మొత్తం 7.50 లక్షల లైట్లు అవసరమవుతాయని సీఎంకు మున్సిపల్ శాఖ నివేదించింది. గతంలో ఉన్న ఏజెన్సీ కాంట్రాక్టు ముగియడంతో ఇప్పుడు చాలాచోట్ల లైట్లు వెలగడం లేదని, నిర్వహణ కూడా సరిగా జరగలేదని అధికారులు వెల్లడించారు.
స్ట్రీట్లైట్ల నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థ
ఎల్ఈడీ లైట్లతోపాటు కంట్రోల్ బాక్సుల ఏర్పాటు, నిరంతరం అవి పనిచేస్తున్నాయా? లేదా?, ఏయే ప్రాంతాల్లో ఇబ్బందులున్నాయో తెలుసుకునేందుకు ప్రత్యేకంగా వ్యవస్థ ఉండాలని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ఐఐటీ హైదరాబాద్లాంటి సంస్థలతో థర్డ్ పార్టీ ఆడిట్ చేయించాలని సూచించారు. కోర్ అర్బన్ సిటీ ఏరియాతో పాటు ఔటర్ఆవల ఉన్న మున్సిపాలిటీల్లోనూ ఎల్ఈడీ లైట్ల ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ మున్సిపాలిటీలతోపాటు కొన్ని మున్సిపాలిటీల్లో కొత్త గ్రామాల విలీనం, గ్రామాల మార్పులు చేర్పులు జరిగాయని అన్నారు. వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని ఎల్ఈడీ లైట్ల అంచనా వేయాలని సీఎం సూచించారు. కోర్ అర్బన్ సిటీతోపాటు మున్సిపాలిటీల్లో ఎల్ఈడీ లైట్లకు కూడా టెండర్లు పిలవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సీఎంవో కార్యదర్శి మాణిక్ రాజ్, పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్. శ్రీధర్, కోర్ అర్బన్ ఏరియా మున్సిపల్ సెక్రటరీ ఇలంబర్తి, మున్సిపల్ శాఖ కార్యదర్శి శ్రీదేవి, జీ హెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ శ్రీజన పాల్గొన్నారు.
స్ట్రీట్లైట్లపై పర్యవేక్షణ పక్కాగా ఉండాలి
రాష్ట్రమంతటా ఎల్ఈడీ వీధి దీపాలపై పర్యవేక్షణ పక్కాగా ఉండాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. గ్రామాల్లో వీధి దీపాల ఏర్పాటు, వాటి నిర్వహణ బాధ్యతలను సర్పంచులకే అప్ప గించాలన్నారు. గ్రామాల్లో అవసరమైనన్ని కొత్త ఎల్ఈడీ లైట్లను అమర్చడంతోపాటు వాటిని సమర్థం గా నిర్వహించే నిర్వహణ అధికారం పంచాయతీల పరిధిలోనే ఉండాలని స్పష్టం చేశా రు. కోర్ అర్బన్ సిటీ పరిధిలో జీహెచ్ఎంసీతోపాటు కొత్తగా చేరిన కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని.. ఎల్ఈడీ లైట్ల అవసరాన్ని అంచనా వేయాలని సీఎం ఆదేశించారు. జీహెచ్ఎంసీ పరిధిలో స్ట్రీట్ లైట్లకు ప్రతి నెలా రూ. 8 కోట్ల కరెంటు బిల్లు అవుతున్నందు న, సోలార్ పవర్ వినియోగించే అంశంపై సాధ్యాసాధ్యాలను స్టడీ చేయాలని అధికారులను ఆదేశించారు.