- ఐదుగురు ఎమ్మెల్యేలను లాగితే చంద్రబాబు ప్రతిపక్ష హోదా పోతుంది
- కానీ అలా చేయను
- చేస్తే బాబుకూ నాకూ తేడా ఉండదు
- ఏపీ అసెంబ్లీలో సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇవాళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగం .. తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. స్పీకర్ గా తమ్మినేని సీతారాం ఎన్నికైన తర్వాత అసెంబ్లీలో మాట్లాడారు జగన్. ఈ అసెంబ్లీ… పార్లమెంటరీ సంప్రదాయాల విషయంలో దేశానికే ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు. ఈ సందర్భంగా ఒక్క విషయం అందరికీ చెప్పాలంటూ ఓ సంగతి చెప్పారు జగన్.
ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే చూద్దాం. “కొందరు నన్ను అడిగారు. చంద్రబాబు నాయుడుకు 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఐదుగురిని లాగేస్తే.. ఆయనకు 18 మందే ఉంటారు. చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా ఉండదు. లాగేద్దాం అన్నారు. నేను అప్పుడు వారికి ఓ చెప్పాను. అలా చేస్తే.. నాకూ ఆయనకు తేడా లేకుండా పోతుంది అని చెప్పాను. అటువంటిది ఎక్కడైనా జరిగితే.. ఆ పార్టీ నుంచి మేం తీసుకుంటే.. వారితో రాజీనామా చేయించిన తర్వాతే తీసుకుంటాం. రాజీనామా కాకుండా తీసుకుంటే.. వారిని వెంటనే డిస్ క్వాలిఫై చేయాలని స్పీకర్ ను కోరుతున్నా అధ్యక్షా.” అని అన్నారు సీఎం వైఎస్ జగన్.