
గోదావరిఖని, వెలుగు : రాష్ట్రంలో బొగ్గు బ్లాక్లను వేలం వేయకుండా సింగరేణి సంస్థకే కేటాయించాలని, వేలం ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకొని గనులు సింగరేణికి దక్కేలా చర్యలు తీసుకోవాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ) ప్రెసిడెంట్ వి సీతారామయ్య, జనరల్ సెక్రటరీ కె.రాజ్కుమార్ కోరారు. మంగళవారం సింగరేణి ఆర్జీ–1 ఏరియా పరిధిలోని జీడీకే ఓసీపీ–5, ఆర్జీ–3 ఏరియా పరిధిలోని ఓసీపీ–2 సైట్ ఆఫీస్ వద్ద గేట్ మీటింగ్లో పాల్గొని మాట్లాడారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం, సింగరేణి ఉన్నతాధికారుల నిర్లక్ష్యంతో బొగ్గు బ్లాక్లు కేంద్రం పరిధిలోకి వెళ్లాయని విమర్శించారు. సింగరేణిని ప్రైవేటీకరణ చేయమని చెప్పిన కేంద్ర మంత్రి గనులను వేలం వేస్తామని ప్రకటించడం రాష్ట్ర ప్రజలను, సింగరేణి కార్మికులను మోసం చేయడమేనన్నారు. వేలంలో బొగ్గు బ్లాక్లు సింగరేణికి దక్కకుంటే కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేస్తామని తెలిపారు.
సింగరేణిలో గెలి చిన సంఘాలకు గుర్తింపు పత్రాలు ఇవ్వడంలో సింగరేణి మేనేజ్మెంట్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. సంస్థలో రాజకీయ జోక్యం తగ్గించకుంటే మనుగడ ప్రశ్నార్ధకంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సింగరేణికి రావాల్సిన రూ.30 వేల కోట్లను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కోరారు. మడ్డి ఎల్లా గౌడ్, ఆరెల్లి పోషం, గుర్రం ప్రభుదాస్, రంగు శ్రీనివాస్, మాదన మహేష్, గండి ప్రసాద్ పాల్గొన్నారు.