గాల్లో ఉండగానే ఇండిగో విమానానికి బాంబ్ బెదిరింపు.. నాగ్‎పూర్‎లో ఎమర్జెన్సీ ల్యాండింగ్

గాల్లో ఉండగానే ఇండిగో విమానానికి బాంబ్ బెదిరింపు.. నాగ్‎పూర్‎లో ఎమర్జెన్సీ ల్యాండింగ్

న్యూఢిల్లీ: ఇండిగో విమానానికి బాంబ్ బెదిరింపు తీవ్ర కలకలం రేపింది. కేరళలోని కొచ్చిన్ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబ్ బెదిరింపు రావడంతో నాగ్‌పూర్‌లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. మంగళవారం (జూన్ 17) ఉదయం 9.20 గంటలకు ఇండిగో విమానం 6E 2706  కేరళలోని కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరింది. 

విమానం గాల్లో ఉండగానే బాంబు బెదిరింపు వచ్చింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు విమానాన్ని నాగ్‌పూర్ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ప్రయాణికులందరిని బయటకు దించేసి.. బాంబ్ స్వ్కాడ్, డాగ్ స్వ్కాడ్ విమానంలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. విమానంలో ఎలాంటి బాంబ్, పేలుడు పదార్థాలు లేవని బాంబ్ స్వ్కాడ్ అధికారులు తేల్చారు. 

దీంతో అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విమానంలో బాంబ్ పెట్టామని బెదిరించిన వ్యక్తిని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ముందస్తు జాగ్రత్తలో భాగంగా నాగ్ పూర్ ఎయిర్ పోర్టులో భద్రతను పెంచారు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF), స్థానిక పోలీసులు పరిస్థితి  పరిశీలించారు.