- తమకు సంబంధించిన లీడర్ల జోలికొస్తే ఊరుకోమని మంత్రి ఫైర్
- గీసుగొండ మండలంలో తమ మాటే చెల్లాలని హుకుం
- సోషల్ మీడియాలో ఆడియో సంభాషణ వైరల్
వరంగల్, వెలుగు : వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే మంత్రి కొండా సురేఖ, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి మధ్య కోల్డ్వార్నడుస్తోంది. దీనికి సంబంధించి ఇద్దరు నేతల మధ్య జరిగిన ఆడియో సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పరకాల నియోజకవర్గంలో తమ అనుచరుడి విషయమై మంత్రి సురేఖ.. ఎమ్మెల్యే రేవూరికి ఫోన్ చేశారు. తమ మనిషిని కాదని ఇతరులకు ఎలా ప్రాధాన్యత ఇచ్చారని రేవూరిని ప్రశ్నించారు. నియోజకవర్గంలో తమకు సంబంధించిన లీడర్ల జోలికి వస్తే ఊరుకోమని హెచ్చరించారు.
‘మా వల్లే మీరు గెలిచారు. నియోజకవర్గంలోని మా సొంత మండలం గీసుగొండలో మేం చెప్పినట్లే నడవాలి’ అని అన్నారు. సొంత పార్టీకి చెందిన రేవూరి గ్రూపులోని జిల్లా, మండల నేతలు తీరు మార్చుకోవాలని..లేదంటే ఊరుకునే ప్రసక్తి లేదన్నారు. కాదు కూడదంటే పరకాల నియోజకవర్గంలో రేవూరికి సహకరించమని తేల్చిచెప్పారు. దాదాపు10 నిమిషాల నిడివి ఉన్న ఈ ఆడియో ఉమ్మడి వరంగల్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.