గోదావరిఖని, వెలుగు: పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం లింగాపూర్ గ్రామ సమీపంలో దళిత యువతకు ఉపాధి కల్పించేందుకు ఏర్పాటు చేయనున్న మెగా లెదర్ ఇండస్ట్రీని కలెక్టర్ అడ్డుకుంటున్నారని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మైస రాజేశ్ ఓ ప్రకటనలో ఆరోపించారు. 25 ఏండ్ల కింద లింగాపూర్ గ్రామ శివారులో సర్వేనంబర్ 132,134లో 25 ఎకరాల ప్రభుత్వ భూమిలో లెదర్ ఇండస్ట్రీ ఏర్పాటుకు సన్నాహాలు జరిగినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదన్నారు.
గతంలో లీడ్ క్యాప్ ద్వారా మంజూరు అయిన ఈ ఇండస్ట్రీ కోసం ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి 5వేల మందికి పైగా దళిత యువతీయువకులు చెన్నై, కాన్పూర్, ఢిల్లీ, ఆగ్రా తదితర ప్రాంతాల్లో శిక్షణ కూడా తీసుకున్నట్లు చెప్పారు. గతంలో లింగాపూర్ శివారులో పదెకరాలు లెదర్ ఇండస్ట్రీ కోసం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు కొంకటి లక్ష్మీనారాయణకు గత కలెక్టర్ లెటర్ కూడా ఇచ్చారని, ప్రస్తుత కలెక్టర్ దానిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
