పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి : కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి : కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

సదాశివనగర్, వెలుగు: పిల్లలను తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లో  చేర్పించాలని కలెక్టర్​ ఆశిష్​ సాంగ్వాన్ కోరారు. గురువారం సదాశివనగర్​మండలం అడ్లూర్ ఎల్లారెడ్డిలోని హరిజన వాడ ప్రభుత్వ పాథమిక పాఠశాలలో బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనకు విద్యార్థులకు పూలు చల్లుతూ స్వాగతం పలికారు. పిల్లలకు పుస్తకాలు, దుస్తులు పంపిణీ చేసిన కలెక్టర్​పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం సకల సౌకర్యాలు కల్పిస్తోందని తెలిపారు.

దాతలు చాలామంది ముందుకొచ్చి స్కూళ్లను తమ వంతుగా అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. దేవాయిపల్లికి చెందిన సైంటిస్ట్​పైడి ఎల్లారెడ్డి పాఠశాలకు రంగులు వేయించడం హర్షణీయమన్నారు. అలాగే గాయత్రీ షుగర్స్ ఫ్యాక్టరీ వారు ఫర్నీచర్​అందించారని పేర్కొన్నారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, యూనిఫామ్, పుస్తకాలు ఇస్తూ అనుభవం గల ఉపాధ్యాయులతో ఇంగ్లీష్​ మీడియంలో విద్యాబోధన సాగిస్తున్నట్లు తెలిపారు.

కలెక్టర్ ను మాజీ సర్పంచ్​పైడి జానకి, వీడీసీ చైర్మన్​ ముదం సత్యం, పైడి ఎల్లారెడ్డి సన్మానించారు. డీఈవో రాజు, ఎంఈవో యోసెఫ్, మండల ప్రత్యేక అధికారి సతీశ్, తహసీల్దార్​ సత్యనారాయణ, సొసైటీ చైర్మన్​ సదాశివరెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకుడు సంకరి విఠల్, మండల ప్రధాన కార్యదర్శి చక్రధర్​గౌడ్, సీడీపీవో శ్రీలత, సూపర్​వైజర్​పద్మ, అంగన్​వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. 

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయాలి

కామారెడ్డి టౌన్, వెలుగు: బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అందరూ కృషి చేయాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్​సూచించారు.  ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని పురష్కరించుకొని గురువారం కలెక్టరేట్​లో పోస్టర్​రిలీజ్​చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 14 ఏండ్లలోపు పిల్లలు తప్పనిసరిగా బడిలో ఉండాలన్నారు. పిల్లలను పనికి పంపించడం వల్ల ఆరోగ్యం దెబ్బతిని, వారి భవిష్యత్​ఇబ్బందుల్లో పడుతుందని తెలిపారు.

బాల కార్మికులను గుర్తించడంలో క్షేత్రస్థాయి అధికారులు బాధ్యతగా పని చేయాలన్నారు.  జిల్లా చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్​ప్రమీల, జిల్లా కార్మిక శాఖ అధికారి కోటేశ్వర్లు, సూపరింటెండెంట్​ విజయ్​భాస్కర్, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్​ఆఫీసర్​స్రవంతి, సాధన కోఆర్డినేటర్ గిరిజ తదితరులున్నారు.

ఆట వస్తువులు అందుబాటులో ఉంచండి

కామారెడ్డి పట్టణవాసులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడంతోపాటు పిల్లలు ఆట వస్తువులు అందుబాటులో ఉంచాలని కలెక్టర్​ఆశిష్ సాంగ్వాన్​సూచించారు. కామారెడ్డి మున్సిపాలిటీ 13వ వార్డు పార్క్​లో ఏర్పాటు చేసిన ఆట పరికరాలను గురువారం​ ఆయన ప్రారంభించారు. పార్క్ లు క్లీన్​గా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.  మున్సిపల్​ కమిషనర్​ రాజేందర్​రెడ్డి, ఏఈ శంకర్​, వార్డు ఆఫీసర్​ దీప్తి తదితరులున్నారు.