
హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రజావాణికి అధికారులు తప్పక హాజరుకావాలని హైదరాబాద్ కలెక్టర్ హరిచందన ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో జరిగిన ప్రజావాణిలో ఆమె ప్రజలనుంచి ఫిర్యాదులు స్వీకరించారు. శాఖలవారీగా ప్రజావాణి పెండింగ్ దరఖాస్తులపై సమీక్ష నిర్వహించారు. వచ్చే సోమవారం నాటికి పరిష్కరించాలని, మళ్లీ రివ్యూ చేస్తానన్నారు. సోమవారం మొత్తం124 ఫిర్యాదులు రాగా, వీల్చైర్ పై వచ్చిన దివ్యాంగ వృద్ధురాలు కలెక్టర్ను కలవడానికి ప్రయత్నించింది.
దీంతో ఆమె స్వయంగా వెళ్లి వినతిపత్రం స్వీకరించారు. మరోవైపు, డయేరియా నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సోమవారం వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో జరిగిన జిల్లాస్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. జూన్ 16 నుంచి జులై 31 వరకు ‘డయేరియా కి రోక్థామ్, శుభ్రత, ఓఆర్ఎస్తో జాగ్రత్తగా ఉండు’ అనే థీమ్తో స్టాప్ డయేరియా క్యాంపెయిన్ ను జిల్లావ్యాప్తంగా చేపట్టాలన్నారు.