విపత్తు సమయంలో పక్కా ప్లాన్​తో పని చేయాలి : కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

విపత్తు సమయంలో పక్కా ప్లాన్​తో పని చేయాలి : కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
  • 300 మంది వాలంటీర్లకు ఆపదమిత్ర శిక్షణ

ఖమ్మం కార్పొరేషన్, వెలుగు​: విపత్తు సమయంలో పక్కా ప్లాన్​తో పని చేస్తే ప్రజల ప్రాణ, విలువైన పత్రాలు, వస్తువులు నష్టపోకుండా నివారించవచ్చని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ లో జిల్లా అధికారులు, ఆపద మిత్రలకు విపత్తుల నిర్వహణపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో గతేడాది  ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 1 వరకు వచ్చిన వరదలతో నగరం ఆపదలో చిక్కుకుందని, జిల్లా అధికారులు, స్వచ్ఛంద సంస్థలు అద్భుతంగా పని చేయడంతో అతి తక్కువ నష్టంతో బయటపడగలిగామని తెలిపారు.

ఈసారి మరింత అలర్ట్​గా ఉండాలన్నారు. జిల్లాలో ప్రమాదాల సమాచారం  కోసం  కలెక్టరేట్ లోని కంట్రోల్ రూమ్ నెంబర్ 1077 కు అందిన వెంటనే విపత్కర పరిస్థితులపై సంబంధిత ప్రాంతాలకు సమాచారం అందుతుందని, అక్కడ రెస్క్యూ బృందాలతో పాటు ఆపదమిత్ర శిక్షణ పొందిన వాలంటీర్లు వెళ్లి సహాయక చర్యలు చేపడుతారని తెలిపారు. ట్రైయినర్స్ మాట్లాడుతూ జిల్లాలో డీఆర్డీఏ ఆధ్వర్యంలో 3 బ్యాచ్ ల్లో  12 రోజులపాటు 300 మంది వాలంటీర్లకు ఆపదమిత్ర శిక్షణ అందించామని, వీరికి ఇన్సూరెన్స్ వర్తిస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సన్యాసయ్య, సీపీవో ఏ. శ్రీనివాస్, ట్రాన్స్​కో ఎస్ఈ శ్రీనివాసాచారి తదితరులు పాల్గొన్నారు. 

రాష్ట్ర అవతరణ వేడుకల ఏర్పాట్లు పరిశీలన

జూన్ 2న రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించనున్న వేడుకల ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. వాతావరణ పరిస్థితులను బట్టి తగిన సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో పద్మశ్రీ, పోలీస్ అడ్మిన్ ఆర్ఐ కామరాజు, అర్బన్ తహసీల్దార్ సైదులు, ఆర్ఐ వహీద్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.