ప్రజా పాలనకు రెడీగా ఉండాలె : రాజర్షి షా

ప్రజా పాలనకు రెడీగా ఉండాలె : రాజర్షి షా

 

 

మెదక్, సంగారెడ్డి టౌన్, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన అమలు కోసం సిద్ధంగా ఉండాలని మెదక్, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు రాజర్షి షా, శరత్​అధికారులను  ఆదేశించారు. ఈనెల 28వ తేదీ నుంచి జనవరి 6 వరకు లబ్దిదారుల ఎంపిక కోసం అర్హులైన వారి నుంచి అప్లికేషన్లు తీసుకోవడానికి గ్రామ సభలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సోమవారం అడిషనల్​ కలెక్టర్లు, ఆయా శాఖల  జిల్లా అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..

జిల్లాల్లో ప్రజా పాలన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించడానికి అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. నియోజకవర్గం, మండల, గ్రామస్థాయిల్లో అధికారుల బృందాలను నియమించి, మహాలక్ష్మి , గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత, రైతు భరోసా పథకాల  కోసం ఉదయం 8 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 6 గంటల వరకు, రెండు దఫాలుగా దరఖాస్తులు స్వీకరించాలన్నారు. దరఖాస్తుదారుల సౌకర్యార్థం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి వారికి కావలసిన కుర్చీలు, టెంట్లు,తాగునీరు

మహిళలకు పురుషులకు వేరువేరుగా క్యూలైన్లల్లు తదితర సౌకర్యాలు కల్పించాలన్నారు. ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణకు ఒకరోజు ముందు ప్రతి గ్రామాల్లో, వార్డుల్లో దండోరావేయించి, సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు. ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణకు ముందు ప్రభుత్వ సందేశం వినిపించి కార్యక్రమాలను ప్రారంభించాలన్నారు. వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి వారికి తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు.