
మానకొండూర్, వెలుగు: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. మంగళవారం మానకొండూరు మండలం వెల్ది పీహెచ్సీని ఆమె సందర్శించారు. హాస్పిటల్లోని ల్యాబ్, మెడిసిన్ స్టోర్స్, వ్యాక్సిన్లు నిల్వ చేసే గది, లేబర్ రూమ్, వార్డులు పరిశీలించారు. హాస్పిటల్లోని పలు రిజిస్టర్లను పరిశీలించారు.
హాస్పిటల్కు వస్తున్న రోగుల సంఖ్య, అందుతున్న వైద్య సేవలపై మెడికల్ ఆఫీసర్ సాయిప్రసాద్ను అడిగి తెలుసుకున్నారు. డీఎంహెచ్వో వెంకటరమణ, ప్రొగ్రామ్ ఆఫీసర్ సనా, తహసీల్దార్ విజయ్ తదితరులు ఉన్నారు.
పోలీస్ అమరులకు నివాళి
కరీంనగర్ క్రైం,వెలుగు: పోలీసుల త్యాగం మరవలేనిదని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మంగళవారం పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా కమిషనరేట్లోని పోలీసు అమరవీరుల స్తూపం వద్ద ఫ్లాగ్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరులకు ఘనంగా నివాళులర్పించారు. సీపీ గౌష్ ఆలం మాట్లాడుతూ ఎంతో మంది పోలీసుల ప్రాణ త్యాగం వల్లే ఈ రోజు స్వేచ్ఛగా జీవించగలుగుతున్నామని తెలిపారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా విధి నిర్వహణలో 47 మంది పోలీసు అధికారులు ప్రాణాలు కోల్పోయారని, వారి త్యాగాలు ఎప్పటికీ వృథా కావన్నారు. అనంతరం అమరవీరుల విగ్రహానికి సాయుధ బలగాలు గౌరవ వందనం సమర్పించాయి. పోలీసు అధికారులు, అమరవీరుల కుటుంబ సభ్యులు పోలీసు అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. కార్యక్రమంలో డీసీపీలు వెంకటరమణ, భీం రావు తదితరులు పాల్గొన్నారు.