
కరీంనగర్ టౌన్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను స్పీడప్ చేయాలని కలెక్టర్ పమేలాసత్పతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజావాణి నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలపై 319 దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం ఆఫీసర్లతో నిర్వహించిన రివ్యూలో మాట్లాడుతూ భూభారతి పోర్టల్లో పెండింగ్లో ఉన్న అప్లికేషన్లను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. రాజీవ్ యువ వికాసం బ్యాంక్ లింకేజీ ప్రక్రియను రెండు రోజుల్లో పూర్తిచేయాలని ఆదేశించారు.
అనంతరం ముఖరంపురలో దివ్యాంగ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన భవిత సెంటర్ను సందర్శించారు. భవిత సెంటర్లో అన్ని రకాలు సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్, డీఆర్వో వెంకటేశ్వర్లు, ఆర్డీవో మహేశ్వర్, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి పవన్ కుమార్, ఎన్వైకే కోఆర్డినేటర్ రాంబాబు, జీసీడీవో కృపారాణి, తదితరులు పాల్గొన్నారు.
డంప్ యార్డు తరలించాలని చిన్నపిల్లల ఫిర్యాదు
సిటీలోని గోదావరిఖని బైపాస్లో ఉన్న డంపింగ్ యార్డును తరలించాలని అలకాపురి, కోతిరాంపూర్, ఆటోనగర్ ఏరియా చిన్నపిల్లలు సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్ పమేలాసత్పతికి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ కాలనీల సమీపంలో డంపింగ్ యార్డు నుంచి వచ్చే వాసనలతో తాము శ్రద్ధగా చదవలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
రాజన్న సిరిసిల్ల, వెలుగు: ప్రజావాణిలో వచ్చే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు.
సోమవారం ప్రజావాణిలో 120 దరఖాస్తులు స్వీకరించినట్లు కలెక్టర్ తెలిపారు. సిరిసిల్ల మున్సిపాలిటీకి చెందిన ఓ ప్లాటు కబ్జాకు గురైందని బీజేపీ నాయకులు ప్రజావాణిలో ఫిర్యాదుచేశారు. జిల్లాలోని ఎరువుల దుకాణాల నిర్వహణకు ఐదు మహిళా సంఘాలకు కలెక్టర్ ప్రొసీడింగ్ పత్రాలు అందజేశారు. ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాబాయి, జడ్పీ సీఈవో వినోద్ కుమార్, డీఏవో అఫ్జల్ బేగం, ఇతర అధికారులు పాల్గొన్నారు.
పోలీస్ గ్రీవెన్స్లో 33 ఫిర్యాదులు
ఎస్పీ ఆఫీసులో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్లో 33 ఫిర్యాదులు స్వీకరించినట్లు ఎస్పీ బి.మహేశ్ గీతే తెలిపారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకు గ్రీవెన్స్ నిర్వహిస్తున్నామన్నారు.
ప్రజావాణి ఫిర్యాదులకు ప్రాధాన్యమివ్వాలి
జగిత్యాల, వెలుగు: ప్రజావాణికి వచ్చే దరఖాస్తుల పరిష్కారానికి ప్రాధాన్యమివ్వాలని జగిత్యాల కలెక్టర్ బి.సత్య ప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణికి 43 ఫిర్యాదులు వచ్చినట్లు చెప్పారు. అడిషనల్ కలెక్టర్ బీఎస్ లత, ఆర్డీఓలు మధుసూదన్, జివాకర్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.