
కరీంనగర్ టౌన్, వెలుగు: మూడేండ్ల నుంచి ఆరేండ్ల లోపు పిల్లలను దగ్గర్లోని అంగన్వాడీ సెంటర్లలో చేర్పించాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. శుక్రవారం సిటీలోని దుర్గమ్మగడ్డ అంగన్వాడీ సెంటర్లో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘శుక్రవారం సభ’కు ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళల సంక్షేమమే ‘శుక్రవారం సభ’ ప్రధాన ధ్యేయమన్నారు. అంగన్వాడీ సెంటర్లో చదువుతోపాటు ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారన్నారు.
మారిన సిలబస్కు అనుగుణంగా టీచర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చామన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, పీహెచ్ సీలు, ప్రత్యేక క్యాంపుల్లో ‘ఆరోగ్య మహిళ’ ద్వారా మహిళలకు 50 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తున్నట్లు వివరించారు. అనంతరం చిన్నారులకు ఎగ్ బిర్యానీ వడ్డించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, డీడబ్ల్యూవో సరస్వతి, డీఎంహెచ్వో వెంకటరమణ, సీడీపీవో సబిత, డాక్టర్ సనా, సూపర్వైజర్ రేణుక పాల్గొన్నారు.