
వేములవాడ, వెలుగు: జిల్లాలో ఎరువులు, విత్తనాలు షాపుల్లో స్టాక్, సేల్స్ రిజిస్టర్లను పకడ్బందీగా నిర్వహించాలని రాజన్నసిరిసిల్ల కలెక్టర్ సందీప్కుమార్ ఝా షాపుల ఓనర్లకు సూచించారు. గురువారం పట్టణంలోని పలు ఎరువులు, విత్తనాల షాపులు, గోదాములను తనిఖీ చేశారు. స్టాక్, సేల్స్ రిజిస్టర్ సరిగా నిర్వహించని శ్రీ లక్ష్మీ ట్రేడర్స్ షాపులో అమ్మకాలను నిలిపేస్తూ నోటీసులు ఇవ్వాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మితే కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ స్పష్టం చేశారు. ఆయన వెంట డీఏవో అఫ్జల్బేగం, వ్యవసాయ అధికారులు తదితరులు ఉన్నారు.
భూభారతితో శాశ్వత పరిష్కారం
వేములవాడరూరల్, వెలుగు భూభారతి చట్టం ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుందని, భూ సమస్యలు ఉన్న రైతులు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝ తెలిపారు. గురువారం వేములవాడ రూరల్ మండలం హన్మాజిపేట రైతు వేదికలో ఏర్పాటు చేసిన రెవెన్యూ భూ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆయన మాట్లాడుతూ జూన్ 3 నుంచి 20 వరకు ప్రతి మండలంలో నిర్వహించే రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ అబుబాకర్ , అధికారులు, రైతులు పాల్గొన్నారు.