ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

మహబూబాబాద్, వెలుగు: మహబూబాబాద్ జిల్లాలో పోడు భూముల సర్వేను వేగవంతం చేయాలని కలెక్టర్ శశాంక ఆఫీసర్లను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లో పోడు భూముల క్లైమ్ లపై రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సర్వే వివరాలను ఎప్పటికప్పుడు యాప్ లో అప్ లోడ్ చేయాలన్నారు. ఆన్ లైన్, పేపర్ రికార్డులకు వ్యత్యాసం ఉండకుండా చూడాలన్నారు. సర్వే బృందం ప్రతిరోజు ఒక జీపీకి 15 క్లైమ్ లు లేదా 35 ఎకరాలకు తగ్గకుండా సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు. మీటింగ్​లో అడిషనల్ కలెక్టర్ డేవిడ్ ఉన్నారు.

అంకితభావంతో పనిచేయాలి..
విద్యుత్ శాఖలో కొత్తగా రిక్రూట్ అయిన ఏఈలు అంకితభావంతో పని చేయాలని కలెక్టర్ శశాంక కోరారు. మంగళవారం ఏఈలకు శిక్షణకు సంబంధించిన మెటీరియల్ ను అందజేశారు. ఈఈ జె.నరేష్, డీఈ లు శ్రీధరాచారీ, సునీతా దేవి, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ అనిల్ ఉన్నారు.

విదేశాలకు ఎగుమతులు పెంచాలి
భూపాలపల్లి రూరల్, వెలుగు: విదేశాల్లో డిమాండ్ ఉన్న వస్తువులు తయారుచేసి, ఎగుమతి చేసేందుకు ఆఫీసర్లు కృషి చేయాలని ఇండియన్ అంబాసిడర్స్ సురేశ్​కె. రెడ్డి, ఎం.సుబ్బారాయుడు, అబ్బగాని రాము సూచించారు. మంగళవారం వారు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించారు. ఆస్పిరేషనల్ జిల్లాగా భూపాలపల్లి ఎంపికైన నేపథ్యంలో ఇందుకు సంబంధించిన పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా మహిళలు బతుకమ్మలు, కోలాటాలతో స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ భవేశ్​మిశ్రా, అడిషనల్ కలెక్టర్ దివాకర, జిల్లా ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా అంబాసిడర్స్ మాట్లాడుతూ.. నాణ్యమైన వస్తువులు విదేశాలకు ఎగుమతి చేసేందుకు కావాల్సిన సహాయ, సహకారాలు అందిస్తామన్నారు. జిల్లాలో చిరుధాన్యాలతో పాటు తస్సార్ సిల్క్ సాగును ప్రోత్సహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనుల గురించి కలెక్టర్ వివరించారు.

ములుగు కలెక్టరేట్ జాగపై వివాదం
స్థలం అటవీశాఖదంటూ పనుల అడ్డగింత
 జేసీబీ టైర్లలో గాలితీసిన ఫారెస్ట్ ఆఫీసర్లు

ములుగు, వెలుగు: ములుగు జిల్లాకేంద్రంలో కొత్త కలెక్టరేట్​కు కేటాయించిన స్థలంపై వివాదం నెలకొంది. ఆ భూమి తమదని రెవెన్యూ ఆఫీసర్లు చెప్తుండగా.. కాదు తమదేనని ఫారెస్ట్ ఆఫీసర్లు గొడవకు దిగారు. పనులు చేయడానికి వచ్చిన ఆర్ అండ్ బీ ఆఫీసర్లను కూడా అడ్డుకున్నారు. జేసీబీ టైర్లలో గాలితీశారు. అయితే ఈ స్థలంపై కలెక్టర్ కృష్ణ ఆదిత్య క్లియర్ గా ఆదేశాలు ఇవ్వగా.. అటవీ అధికారులు వాటిని పట్టించుకోలేదు.

అసలేం జరిగిందంటే..
ములుగులో కొత్త కలెక్టరేట్ నిర్మాణం కోసం గట్టమ్మ సమీపంలోని సర్వే నెం.573/2లో 53.31ఎకరాల జాగను రెవెన్యూ శాఖ కేటాయించింది. ఇదే సర్వే నెంబర్ లో మరో 57.9ఎకరాల భూమిని నిరుపేదలకు అసైన్ చేస్తూ రెవెన్యూ శాఖ నిర్ణయం తీసుకుంది. కలెక్టరేట్ నిర్మాణానికి ఆఫీసర్లు హద్దులు నిర్ణయించారు. మంగళవారం ఆ భూమి చుట్టూ ట్రెంచ్ కొట్టేందుకు ఆర్ అండ్ బీ ఆఫీసర్లు రాగా.. ఫారెస్ట్ అధికారులు అడ్డుచెప్పారు. ఈ భూమి అటవీశాఖదని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈక్రమంలో రెవెన్యూ, ఫారెస్ట్​ఆఫీసర్ల మధ్య మాటల యుద్ధం సాగింది. ఫారెస్ట్ సిబ్బంది ఒక అడుగు ముందుకేసి జేసీబీ టైర్లలో గాలి కూడా తీశారు. కలెక్టర్ ఆదేశాలను కూడా పరిగణలోకి తీసుకోకపోవడంతో రెవెన్యూ సిబ్బంది కలెక్టర్ కు తెలియజేశారు. ఫారెస్ట్ ఆఫీసర్లు సైతం డీఎఫ్​వో ప్రదీప్ కుమార్ శెట్టికి విషయం చేరవేశారు. సాయంత్రమైనా ఈ వివాదం కొలిక్కి రాలేదు.

వారం రోజులుగా కరెంట్ బంద్!
రెండోసారి రోడ్డెక్కిన తండావాసులు

వర్ధన్నపేట, వెలుగు: వరంగల్​జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని డీసీ తండాలో గత వారం రోజులుగా కరెంట్ లేదు. దీంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మూడ్రోజుల కింద కూడా ధర్నా చేస్తే.. రెండ్రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని చెప్పిన ఆఫీసర్లు.. ఇప్పటివరకు స్పందించలేదు. దీంతో మరోసారి మంగళవారం ఖమ్మం– వరంగల్ రహదారిపై ధర్నా చేశారు. మున్సిపాలిటీలో విలీనమైతే.. బాధలు తీరుతాయనుకుంటే, పెరిగాయని మండిపడ్డారు. కరెంట్ లేక నీళ్లకు కూడా తిప్పలు పడుతున్నామని.. ఒక్క నాయకుడు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. గెలిపించిన నాయకులంతా మునుగోడులో ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. అలాగే మున్సిపల్ ఎన్నికల్లో తండాకు ఉచిత కరెంట్ ఇస్తామని లీడర్లు హామీ ఇచ్చి, మోసం చేశారని ఆరోపించారు.

కొంపముంచిన ఆన్ లైన్ బిజినెస్
కాజీపేట, వెలుగు: ఇన్ స్టా గ్రామ్ లో గుర్తు తెలియని బిజినెస్ సైట్ ఓపెన్ చేసి ఓ యువతి రూ.1.5లక్షలు పోగొట్టుకుంది. కాజీపేట సీఐ గట్ల మహేందర్ రెడ్డి వివరాల ప్రకారం.. వరంగల్ నిట్​లో చదువుతున్న ఓ స్టూడెంట్ కు ఇన్​స్టా గ్రామ్ లో తక్కువ టైంలో ఎక్కువ సంపాదించవచ్చనే బిజినెస్ సైట్​కనిపించింది. అది ఓపెన్ చేయగా.. కొన్ని ప్రొడక్ట్స్ కనిపించాయి. వాటి మీద పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని ఉంది. దీంతో ఆమె రూ.1.5లక్షలు ఇన్వెస్ట్ చేసింది. రోజులు గడిచినా లాభాలు రాకపోవడంతో మోసపోయానని గ్రహించి, పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పనిచేస్తున్న సంస్థకే కన్నం వేసిన ఉద్యోగి
తాను పనిచేస్తున్న సంస్థకే ఓ ఉద్యోగి కన్నం వేశాడు. కంపెనీకి చెందిన రూ.5.60 లక్షల వస్తువులు అమ్ముకున్నాడు. కాజీపేట సీఐ గట్ల మహేందర్ రెడ్డి వివరాల ప్రకారం.. బెంగుళూరుకు చెందిన ఇన్​స్టా కార్ట్ అనే ఈకామర్స్ సంస్థ కాజీపేటలో బ్రాంచ్ ఓపెన్ చేసింది. కస్టమర్లు ఆర్డర్ చేసిన వస్తువులను వారి ఇంటికి చేరవేస్తుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన జాటోత్ రవీందర్ అనే వ్యక్తి కాజీపేటలోని సదరు బ్రాంచ్ కి ఇన్​చార్జిగా వ్యవహరిస్తున్నాడు. కస్టమర్లకు చేరవేయాల్సిన ఖరీదైన టీవీలు, వాషింగ్ మెషిన్​లు, ఏసీలు, కుక్కర్లు, జిమ్ సామాన్లను సంస్థకు తెలియకుండా బయటి వ్యక్తులకు అమ్ముకున్నాడు. దీంతో కంపెనీ ప్రతినిధి సందీప్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

సీసీ కెమెరాల ఏర్పాటు అభినందనీయం
భూపాలపల్లి రూరల్, వెలుగు: సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు ముందుకు రావాలని భూపాలపల్లి సీఐ రాజిరెడ్డి కోరారు.  భూపాలపల్లిలోని ‘ది కాకతీయఖని ఓనర్స్ అండ్ వెల్ఫేర్’ అసోసియన్ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ..  అసోసియేషన్ లో ఆన్ లైన్ సేవలు, సీసీ కెమెరాలు అందుబాటులోకి రావడం అభినందనీయమన్నారు. సీసీ కెమెరాలతో భద్రత, రక్షణ ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం లారీ ఓనర్లు, డ్రైవర్లకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ మెంబర్లు మేనం రాజేందర్, మాడ ప్రతాప్ రెడ్డి, తుమ్మేటి రామ్ రెడ్డి, బొమ్మెర అశోక్, ఇంచర్ల రాజు, గంపల రామన్న, బొడ్డు రవీందర్, మారెళ్ళ  సేనాపతి, పులి వేణుగోపాల్ గౌడ్ పాల్గొన్నారు.

చాతి నొప్పితో నిట్ స్టూడెంట్ మృతి
కాజీపేట, వెలుగు: చాతినొప్పి కారణంగా వరంగల్ నిట్ స్టూడెంట్ చనిపోయాడు. కాజీపేట సీఐ గట్ల మహేందర్ రెడ్డి వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సన్యం జైన్(29) నిట్ కాలేజీలో ఎంటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. మంగళవారం చాతిలో నొప్పిగా ఉందని నిట్ స్టాఫ్​కి తెలపడంతో.. వారు సిటీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. జైన్ మృతితో తోటి మిత్రులు రోదించారు.

ఉద్యోగాల పేరిట వసూళ్లు..సీనియర్ అసిస్టెంట్ ​సస్పెన్షన్
హనుమకొండ సిటీ, వెలుగు: టీఎస్​ఎన్​పీడీసీఎల్​ లో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఆశచూపి డబ్బులు వసూలు చేసిన సీనియర్​ అసిస్టెంట్​ను సస్పెండ్​ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. హనుమకొండ రూరల్​ డివిజన్​ లో సయ్యద్​  ఇంతియాజుద్దీన్​ ఖురేషీ సీనియర్​అసిస్టెంట్​గా పని చేస్తున్నాడు. టీఎస్​ఎన్​పీడీసీఎల్​ లో వివిధ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఆ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి, కొంతమంది నుంచి డబ్బులు వసూలు చేశాడు. నెలలు గడుస్తున్నా జాబ్​ రాకపోవడంతో ఓ బాధితుడు విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో సయ్యద్​ ఇంతియాజుద్దీన్​ ను సస్పెండ్ చేస్తూ హనుమకొండ ఆపరేషన్​ సర్కిల్​ ఎస్​ఈ కె.వెంకటరమణ మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. కేసు దర్యాప్తు పూర్తయ్యే వరకు వరకు హెడ్​ క్వార్టర్స్​ ను వదిలి వెళ్లకూడదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

కొంపముంచిన ఆన్ లైన్ బిజినెస్
కాజీపేట, వెలుగు: ఇన్ స్టా గ్రామ్ లో గుర్తు తెలియని బిజినెస్ సైట్ ఓపెన్ చేసి ఓ యువతి రూ.1.5లక్షలు పోగొట్టుకుంది. కాజీపేట సీఐ గట్ల మహేందర్ రెడ్డి వివరాల ప్రకారం.. వరంగల్ నిట్​లో చదువుతున్న ఓ స్టూడెంట్ కు ఇన్​స్టా గ్రామ్ లో తక్కువ టైంలో ఎక్కువ సంపాదించవచ్చనే బిజినెస్ సైట్​కనిపించింది. అది ఓపెన్ చేయగా.. కొన్ని ప్రొడక్ట్స్ కనిపించాయి. వాటి మీద పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని ఉంది. దీంతో ఆమె రూ.1.5లక్షలు ఇన్వెస్ట్ చేసింది. రోజులు గడిచినా లాభాలు రాకపోవడంతో మోసపోయానని గ్రహించి, పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పనిచేస్తున్న సంస్థకే కన్నం వేసిన ఉద్యోగి
తాను పనిచేస్తున్న సంస్థకే ఓ ఉద్యోగి కన్నం వేశాడు. కంపెనీకి చెందిన రూ.5.60 లక్షల వస్తువులు అమ్ముకున్నాడు. కాజీపేట సీఐ గట్ల మహేందర్ రెడ్డి వివరాల ప్రకారం.. బెంగుళూరుకు చెందిన ఇన్​స్టా కార్ట్ అనే ఈకామర్స్ సంస్థ కాజీపేటలో బ్రాంచ్ ఓపెన్ చేసింది. కస్టమర్లు ఆర్డర్ చేసిన వస్తువులను వారి ఇంటికి చేరవేస్తుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన జాటోత్ రవీందర్ అనే వ్యక్తి కాజీపేటలోని సదరు బ్రాంచ్ కి ఇన్​చార్జిగా వ్యవహరిస్తున్నాడు. కస్టమర్లకు చేరవేయాల్సిన ఖరీదైన టీవీలు, వాషింగ్ మెషిన్​లు, ఏసీలు, కుక్కర్లు, జిమ్ సామాన్లను సంస్థకు తెలియకుండా బయటి వ్యక్తులకు అమ్ముకున్నాడు. దీంతో కంపెనీ ప్రతినిధి సందీప్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.