
నిజామాబాద్, వెలుగు : ఈనెల 16 న నిర్వహించే రైతు నేస్తం ప్రోగ్రామ్కు జిల్లాలోని రైతు వేదికలను రెడీ చేయాలని కలెక్టర్ టి.వినయ్కృష్ణారెడ్డి సూచించారు. సీఎం రేవంత్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో నేరుగా మాట్లాడే ఈ కార్యక్రమానికి టెక్నికల్ సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. హాజరయ్యే అన్నదాతల కోసం నీటి వసతి, టాయిలెట్స్, ఫర్నిచర్ ఏర్పాటు చేయాలని, శుభ్రమైన పరిసరాల ఉండేలా చూడాలన్నారు. శనివారం డిచ్పల్లి, నడిపల్లి, మోపాల్లో రైతు వేదికలు విజిట్ చేసి వ్యవసాయ అధికారులతో మాట్లాడారు. పచ్చదనం ప్రతిబింబించేలా మొక్కలు నాటాలని పూలమొక్కలు పెట్టాలన్నారు. జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ వీరస్వామి తదితరులు ఉన్నారు.
‘భూభారతి’ దరఖాస్తులకు టాప్ ప్రయారిటీ
భూ సమస్యలకు పర్మినెంట్ పరిష్కారం చూపే భూభారతి సభల్లో వచ్చే దరఖాస్తులను టాప్ ప్రయారిటీ కింద పరిగణించాలని కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి సూచించారు. శనివారం ఆయన నార్త్, సౌత్ తహసీల్దార్ ఆఫీస్లు విజిట్ చేశారు. ఎక్కడా చిన్న పొరపాటు జరగకుండా ప్రతి అప్లికేషన్ను వేగంగా పరిష్కరించాలని సూచించారు. తనకు క్రమం తప్పకుండా నివేదికలు ఇవ్వాలన్నారు. ఆర్డీవో రాజేంద్రకుమార్, తహసీల్దార్లు బాలరాజు, విజయ్కాంత్ తదితరులు ఉన్నారు. కాగా కొత్త కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డిని సీపీ సాయి చైతన్య మర్యాదపూర్వకంగా కలిసి పూలబొకే అందించారు.