హుజూర్ నగర్, వెలుగు: మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లంతా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ కోరారు. సోమవారం హుజూర్ నగర్ డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పట్టణంలో 28 వార్డుల్లో మూడో వార్డు ఏకగ్రీవమైందని, మిగిలిన 27 వార్డుల్లో 28,867 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశామన్నారు.
17 ప్రాంతాల్లో 54 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. ఆర్డీవో శ్రీనివాసులు, అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్ బి. శ్రీనివాస్, తహసీల్దార్ కవిత, ఎంపీవో లావణ్య పాల్గొన్నారు.
నేరేడుచర్ల: పట్టణంలోని రాచకొండ సీతారామ నరసయ్య టౌన్ హాల్ లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సందర్శించి పలు సూచనలు చేశారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో సిబ్బందికి మౌలిక సదుపాయాలు కల్పించాలని, లైటింగ్, టాయిలెట్స్, తాగునీరు, భోజనం ఏర్పాట్లు చేయించాలని సూచించారు. సిబ్బంది, బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు ఎస్కార్ట్ వాహనంతో వెళ్లాలని ఆదేశించారు. ఆర్డీవో శ్రీనివాసులు, మున్సిపల్ కమిషర్ సీహెచ్ నాగరాజు, తహసీల్దార్ సైదులు గౌడ్ పాల్గొన్నారు.
