కర్నూలు ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలు ప్రారంభం

కర్నూలు ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలు ప్రారంభం
  • వేడుకగా ప్యాసింజర్ విమానాల ప్రారంభోత్సవం
  • బెంగళూరు-కర్నూలు తొలి విమానానికి రాయల్ సెల్యూట్
  • తొలి ప్యాసింజర్ విమానం నడిపిన పైలట్ వీరా కూడా 

కర్నూలు: రాయలసీమ ముఖద్వారమైన కర్నూలు ఎయిర్ పోర్టులో ప్రయాణికుల విమానాల రాకపోకలు ఆదివారం ప్రారంభమయ్యాయి. స్థానిక ప్రజల చిరకాల వాంఛ అయిన విమాన ప్రయాణం అందుబాటులోకి వచ్చిన సందర్భంగా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు. జిల్లాకు చెందిన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చేతులమీదుగా  వేడుకగా తొలి ప్రయాణికుల విమాన ప్రారంభోత్సవ వేడుక జరిగింది. ఆదివారం  సరిగ్గా ఉదయం 10.10 గంటలకు కర్నూలు ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయిన బెంగళూరు-కర్నూలు ఇండిగో విమానానికి రెండు అత్యాధునిక ఫైరింజన్ల ద్వారా నీళ్లు చిలుకరించి రాయల్ సెల్యూట్ తో విమానానికి స్వాగతం పలికారు. బెంగళూరు నుండి కర్నూలు వచ్చిన తొలి ప్యాసింజర్ విమానంలో విచ్చేసిన కర్నూలు వాసి, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కు, ఇతర  ప్రయాణీకులకు ఘన స్వాగతం
 పలికారు మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, గుమ్మనూరు జయరాం, ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, కలెక్టర్ వీరపాండియన్, ఎస్పీ డా. ఫక్కీరప్ప తదితరులు. అలాగే కర్నూలు నుండి విశాఖపట్నం  బయలుదేరి వెళ్లిన తొలి విమానానికి టికెట్లు బుక్ చేసుకుని వెళ్లిన ప్రయాణీకులకు పుల్లారెడ్డి స్వీట్ బాక్సులను, స్మారక పోస్టల్ కవర్లను  అందించారు. బయలుదేరి వెళ్తున్న తొలి విమానానికి జాతీయ జెండాను ఊపి ప్రారంభించారు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. 

తొలి ఇండిగో ప్యాసింజర్ విమానం పైలట్ కర్నూలు వాసి వీరా
స్థానికులను దశాబ్దాలుగా ఊరించి నెరవేరిన విమాన సేవల కల అందుబాటులోకి రావడం ఒక ఎత్తు అయితే.. ప్రయాణికుల తొలి విమానాన్ని కర్నూలు తీసుకొచ్చిన ఘనత కూడా కర్నూలు వాసికే దక్కడం విశేషం.  కర్నూలు లో పుట్టి పెరిగి పైలట్ అయి..కర్నూలు ఎయిర్ పోర్ట్ కు ఫస్ట్ ప్యాసింజర్ ఇండిగో ఫ్లైట్ కు పైలట్ గా రావడం పై వీరా సంతోషంతో పొంగిపోయాడు. రాయలసీమ వాసులు ప్రత్యేకించి ఆంధ్రుల తొలి రాజధాని కర్నూలు జిల్లా వాసుల సొంత గడ్డ నుండి విమానయాన దశాబ్దాల  కలను నిజం చేస్తూ.. సీఎం జగన్ ఈ నెల 25 న కర్నూలు ఎయిర్ పోర్టును ప్రారంభించడంతో పాటు ఎయిర్ పోర్ట్ కు తొలి స్వాతంత్ర్య సమర యోధుడు, రేనాటి వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెడుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆదివారం నాడు మరో చరిత్రాత్మక ఘట్టాన్ని తొలి ప్యాసింజర్ ఫ్లైట్ ప్రారంభోత్సవాన్ని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆధ్వర్యంలో.. వేడుకగా ..పండుగ వాతావరణం లో..ఆనందోత్సవాలు, చప్పట్లు, కేరింతల నడుమ నిర్వహించారు.  

ప్రయాణికుల విమానం ఆవిష్కరణ చారిత్రక ఘట్టం

కర్నూలు ఎయిర్ పోర్ట్ లో ఆదివారం తొలి ప్రయాణికుల విమానాల రాకపోకల ఆవిష్కరణ చరిత్రాత్మక ఘట్టంలా నిర్వహించారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో పండుగ వాతావరణంలో ఆనందోత్సవాల నడుమ అద్భుతంగా జరిగింది. బెంగళూరు నుండి కర్నూలు విమానాశ్రయానికి ఆదివారం ఉదయం 10:10 గంటలకు చేరుకున్న తొలి ప్యాసింజర్ ఇండిగో ఫ్లైట్ కు రెండు అత్యాధునిక ఫైర్ ఇంజన్స్  వాటర్ క్యానన్స్ తో రాయల్ సెల్యూట్ తో ఎయిర్ పోర్ట్ అధికారులు ఘన స్వాగతం పలికారు. తొలి ప్యాసింజర్ ఫ్లైట్స్ (ఇండిగో)  బెంగళూరు-కర్నూలు; కర్నూలు-విశాఖపట్నం ఫ్లైట్స్ కు జాతీయ జెండా ఫ్లాగ్ వేవ్ చేసి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆవిష్కరించగా కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం..ఎంపీలు పోచా బ్రహ్మానంద రెడ్డి,  ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్,  జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్, ఏపీ  ఎయిర్ పోర్ట్స్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఎండి భరత్ కుమార్ రెడ్డి, జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప, జాయింట్ కలెక్టర్లు రామసుందర్ రెడ్డి, సయ్యద్ ఖాజా, కర్నూలు మునిసిపల్ కమీషనర్ డీకే బాలాజీ, ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ కైలాష్ మండల్, డిఆర్డీఏ పిడి శ్రీనివాసులు, డి.ఆర్.ఓ ఫుల్యాయ్ ఐ&పీఆర్ డిడి తిమ్మప్ప, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస రెడ్డి, ఓర్వకల్ సర్పంచ్ తోట అనూష తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బెంగళూరు-కర్నూలు తొలి ప్యాసెంజర్ ఫ్లైట్ (ఇండిగో 6ఈ 7911) ను నడిపిన పైలట్  కర్నూలు వాసి వీరా..తొలి ప్యాసింజర్స్ హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, బెంగళూరు నాగరబావి నివాసి రాంప్రసాద్ దంపతుల కూతురు సాయి ప్రతీక్ష(6 సంవత్సరాలు) లకు పూల మొక్కలతో ఘన స్వాగతం పలికారు. వారి తొలి విమాన ప్రయాణ అనుభూతిని అడిగి తెలుసుకున్నారు. అలాగే, కర్నూలు విమానాశ్రయం నుండి విశాఖపట్నం బయలు దేరిన తొలి ప్యాసింజర్ ఫ్లైట్ (ఇండిగో 6ఈ 7912) కు జాతీయ జెండా ఊపి ప్రారంభించి, ప్యాసింజర్స్ కు స్వీట్స్ ప్యాకేట్స్ ను బహుకరించి ..హ్యాపీ జర్నీ చెప్పారు. ఈ సందర్భంగా ఎయిర్ పోర్ట్ మొత్తం కేరింతలు, చప్పట్లతో  పండుగ వాతావరణం ఏర్పడింది. చరిత్రాత్మక ఘట్టంలో తాము కూడా ప్రత్యక్ష సాక్షులుగా నిలిచామనే ఆనందం ప్రతి ఒక్కరి కళ్లలో కనిపించింది. అధికారులు, ప్రజా ప్రతినిధులు, ఎయిర్ పోర్ట్ అధికారులు, ప్రయాణీకులు ఎయిర్ పోర్ట్ లో గ్రూప్ ఫోటోలు, సెల్ఫీలు దిగారు. ఈ సందర్భంగా బెంగళూరు నుండి కర్నూలు విమానాశ్రయం కు ఫస్ట్ ఫ్లైట్ నడిపిన పైలట్ వీరా కూడా కాసేపు విరామ సమయంలో రన్ వే మీదున్న ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ దగ్గరకు వచ్చి, గ్రూప్ ఫోటో దిగుతూ..మాటల మధ్యలో..తాను కూడా కర్నూలు లో పుట్టి పెరిగి పైలట్ అయి..కర్నూలు ఎయిర్ పోర్ట్ లో ఫస్ట్ ప్యాసింజర్ ఇండిగో ఫ్లైట్ కు పైలట్ గా వచ్చానని.. ఇది నా జీవితంలో ఒక మధురానుభూతిని మిగిల్చిందన్నారు. పైలట్ వీరా కూడా కర్నూలు వాసినేనన్న విషయం తెలియడంతో మంత్రులు, ఎమ్మెల్యేలు సహా అందరూ ఆనందాన్ని పంచుకున్నారు. తొలి ప్యాసెంజర్ ఫ్లైట్స్ లో బెంగళూరు నుండి కర్నూలుకు రావడం.. మళ్లీ కర్నూలు ఎయిర్ పోర్ట్ నుండి విశాఖపట్నం బయలుదేరి వెళ్లడం.. నా జీవితంలో ఎన్నటికీ మారిచిపోలేని మధురానుభూతిని మిగిల్చిందని  పైలట్  వీరా సంతోషం వ్యక్తం చేశారు. నేను కమర్షియల్ ఫ్లైట్స్ పైలెట్ గా 15 సంవత్సరాల నుండి పని చేస్తున్నాను..మా పెద్దలది మహబూబ్ నగర్ జిల్లా - కర్నూలు జిల్లా సరిహద్దులోని శాంతి పురం.. అయితే నేను పుట్టి పెరిగింది ..చదువుకున్నది అంతా కర్నూలు లోనే.. చదవు పూర్తయ్యాక పైలట్ గా ఎదిగి.. నేను పుట్టి పెరిగిన కర్నూలు ఎయిర్ పోర్ట్ కు తొలి విమానాన్ని తీసుకురావడం పైలట్ గా, వ్యక్తి గతంగా నా అదృష్టం.. ఈ మధురానుభూతిని ఎప్పటికీ మరువను అని ఆర్థిక శాఖ మంత్రితో, మీడియాతో తన ఆనందాన్ని పంచుకున్నారు. అంతకుముందు ఎయిర్ పోర్ట్ టెర్మినల్ బిల్డింగు లో సాంస్కృతిక కార్యక్రమాలను, అభినందన సమావేశాన్ని నిర్వహించారు. కర్నూలు ఎయిర్ పోర్ట్ కు కృషి చేసిన జిల్లా  అధికారులను, కంట్రాక్టర్లను, ఇంజనీర్లను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గుమ్మనూరు జయరామ్ ఘనంగా సన్మానించి మెమెంటో లను బహుకరించారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన కర్నూలు జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ విమాన సర్వీసులు ప్రారంభం కావడంతో తొలిరోజే చెన్నైకు బయలుదేరి వెళ్లారు. సాయంత్రం 4:30 గంటలకు చెన్నై వెళ్లిన తొలి ప్యాసెంజర్ విమానం (ఇండిగో 6ఈ7916) లో చెన్నై వెళ్లారు. ఇవాళ రాత్రి చెన్నైలోని కుటుంబ సభ్యులతో గడపనున్న జిల్లా కలెక్టర్ వీరపాండియన్ రేపు ఉదయం  చెన్నై నుండి కర్నూలుకు  తిరిగి రానున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. 

కర్నూలు నుండి విమాన సర్వీసుల వివరాలు
విశాఖపట్టణం,బెంగళూరు,చెన్నై నగరాలకు

ఫ్టైట్ నెంబర్    నడిచే రోజులు   ఎక్కడి నుంచి        బయలుదేరే సమయం        ఎక్కడికి..        చేరుకునే సమయం

6ఈ 7911      సోమ, బుధ, శుక్ర, ఆదివారాలు      బెంగళూరు               9.05                 కర్నూలు         10.10
6ఈ 7912      సోమ, బుధ, శుక్ర, ఆదివారాలు      కర్నూలు                10.30                 విశాఖపట్టణం     13.00
6ఈ 7913      సోమ, బుధ, శుక్ర, ఆదివారాలు      విశాఖపట్టణం           13.00                కర్నూలు          14.55
6ఈ 7914      సోమ, బుధ, శుక్ర, ఆదివారాలు      కర్నూలు                15.15                 కర్నూలు         16.25
6ఈ 7915      మంగళ, గురు,శని, ఆదివారాలు      చెన్నై                    14.50                కర్నూలు         16.10
6ఈ 7916     మంగళ, గురు, శని, ఆదివారాలు      కర్నూలు                16.30                చెన్నై             17.50