- ఐదుగురితో ఏర్పాటు చేసిన రాష్ట్ర సర్కారు
- కన్వీనర్గా వ్యవహరించనున్న సీసీఎల్ఏ
- పోర్టల్ రీస్ట్రక్చర్పైనా సిఫార్సులు చేయనున్న కమిటీ
హైదరాబాద్, వెలుగు: ధరణి పోర్టల్పై రాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. పోర్టల్లో ఉన్న సమస్యలపై అధ్యయనానికి, ధరణిని రీస్ట్రక్చర్ చేసేందుకు ఐదుగురితో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో సభ్యులుగా కాంగ్రెస్ సీనియర్ నేత కోదండరెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ రేమండ్ పీటర్, భూ నిపుణుడు, అడ్వకేట్ భూమి సునీల్, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ మధుసూదన్ను నియమించింది. కమిటీ కన్వీనర్గా సీసీఎల్ఏ వ్యవహరించనున్నారు. ధరణి పోర్టల్ను రద్దు చేసి.. దానికి బదులుగా భూమాత పోర్టల్ను తీసుకొస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక ధరణిపై పూర్తిస్థాయి వివరాలను సీఎం రేవంత్ రెడ్డి తెప్పించుకున్నారు. తాజాగా అందుకు అనుగుణంగా కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ధరణిలో చాలావరకు ట్రాన్సాక్షన్స్ను ప్రభుత్వం నిలిపివేసింది. కమిటీ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా మార్పులతో భూమాత పోర్టల్ను తీసుకురానుంది. ఇదే సమయంలో కలెక్టర్కు మాత్రమే ఉన్న పవర్స్ను ఆర్డీఓ, ఎమ్మార్వో స్థాయి వరకు వికేంద్రీకరించనుందని సమాచారం.