
- జిల్లా ఇన్చార్జి మంత్రి చైర్మన్, కలెక్టర్ కన్వీనర్గా త్వరలో కమిటీలు
- అసైన్డ్ చేసి 20 ఏండ్లు పూర్తైన భూ యజమానులకు శాశ్వత హక్కులు?
- కొత్తగా భూముల గుర్తింపు, పంపిణీపైనా అసైన్డ్ కమిటీలు ఫోకస్
- అన్యాక్రాంతమైన భూములపైనా వీటి నిర్ణయమే ఫైనల్
- సీఎం రేవంత్ దగ్గరకు చేరిన ఫైలు.. త్వరలోనే డెసిషన్
- ఆమోదం పొందితే ఏండ్ల సమస్యకు పరిష్కారం
హైదరాబాద్, వెలుగు: అసైన్డ్ భూముల సమస్యల పరిష్కారంపై రాష్ట్ర సర్కారు ఫోకస్పెట్టింది. ఇందులో భాగంగా జిల్లాస్థాయిలో అసైన్డ్ కమిటీల ఏర్పాటుకు తాజాగా గ్రీన్ సిగ్నల్ఇచ్చింది. ఇప్పటికే పంపిణీ చేసిన అసైన్డ్ భూములకు సంబంధించి, అర్హులైనవారికి యాజమాన్య హక్కులు కల్పించడంతోపాటు కొత్తగా భూముల పంపిణీకి ఈ కమిటీలు చర్యలు తీసుకుంటాయి. అన్యాక్రాంతమైన భూములపైనా అసైన్డ్ కమిటీల నిర్ణయమే కీలకం కానున్నది. ఈ మేరకు రెవెన్యూశాఖ రూపొందించిన ఫైలు సీఎం కార్యాలయానికి చేరింది.
అసైన్డ్ చేసి 20 ఏండ్లు పూర్తైన భూములకు హక్కులు కల్పించాలని కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలిసింది. దీంతో చేతిలో అసైన్డ్ పట్టాలు, మోకామీద భూమి ఉండి యాజమాన్య హక్కులు లేనివారు, రికార్డుల్లో భూమి ఉన్నా ఫీల్డ్లో లేక ఇబ్బందులు పడ్తున్న రైతుల్లో హర్షం వ్యక్తమవుతున్నది. అదే సమయంలో కొత్త భూముల గుర్తింపు, పంపిణీకి సర్కారు సిద్ధమవుతున్నట్లు తెలిసి భూములు లేని నిరుపేదల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
కొత్తగా పంపిణీ.. నోటరీలపై మారిన అసైన్డ్ భూములు
అసైన్డ్ కమిటీల ఏర్పాటు తర్వాత ఆయా జిల్లాల్లో ఖాళీగా, నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించే ప్రక్రియ ప్రారంభించనున్నారు. ఇందుకోసం సమగ్ర సర్వే నిర్వహించనున్నారు. పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండి, వ్యవసాయానికి అనువుగా ఉన్న భూములను అర్హులైన పేదలకు కేటాయిస్తారు. మరోవైపు కొన్ని దశాబ్దాల క్రితం అసైన్డ్ చేసిన ప్రాంతాలు అప్పట్లో వ్యవసాయ భూములు కాగా, ప్రస్తుతం పట్టణాలు, వాణిజ్య కేంద్రాలుగా మారాయి. ప్రధానంగా హైదరాబాద్ చుట్టుపక్కల, ఇతర ప్రధాన నగరాల శివార్లలోని అసైన్డ్ భూముల విలువ కోట్లలో పలుకుతున్నది. దీంతో అసైన్డ్ భూముల చుట్టూ అనేక వివాదాలు నెలకొన్నాయి.
భారీ ఆర్థిక లావాదేవీలు జరుగుతుండడంతో న్యాయపరమైన చిక్కులు తలెత్తుతున్నాయి. రికార్డుల్లో ఒకరు ఉంటే ఫీల్డ్లో మరొకరు ఉంటున్నారు. చాలాచోట్ల ఎలాంటి అధికారిక లావాదేవీలు జరగకపోయినా వేరేవాళ్ల చేతుల్లోకి అసైన్డ్ భూములు వెళ్లాయి. మరికొందరు తండ్రులు, తాతల నుంచి వచ్చిన అసైన్డ్ భూములు సాగు చేసుకుంటున్నప్పటికీ పట్టాదారుపాస్ బుక్స్ లేవు. బుక్కులు ఉన్నవారికి అసైన్డ్ భూములపై హక్కులు లేవు. దీంతో ఈ సమస్యలన్నింటికీ అసైన్డ్ కమిటీలతో పరిష్కారం చూపించాలని ప్రభుత్వం భావిస్తున్నది. వాస్తవానికి ఉమ్మడి ఏపీలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం విడతలవారీగా పేదలకు ప్రభుత్వ భూములను అసైన్డ్ చేసింది.
ఆయా భూములను అవసరాలకు అమ్ముకుంటుండడంతో అప్పటి ప్రభుత్వం అసైన్డ్ భూముల బదలాయింపు నిషేధ చట్టం –1977ను తీసుకొచ్చింది. దీని ప్రకారం అసైన్డ్ చట్టం కింద భూమిని పొందిన యజమాని మినహా.. మరెవ్వరికీ దానిపై అధికారం ఉండదు. విక్రయం, దానం, బహుమతి ఇవ్వడానికి కూడా వీలుండదు. కానీ ఈ చట్టం విక్రయాలను ఆపలేదు. పేదల అవసరాలను ఆసరాగా చేసుకొని చాలా మంది అసైన్డ్ భూములను తక్కువ రేట్లకు కొన్నారు. నోటరీలు, తెల్ల కాగితాలు రాసుకొని కొనుక్కున్నారు. అసైన్డ్ భూములు కొన్నవారిలో పేదలు కూడా ఉన్నారు. దీంతో ఈ సమస్యను మానవీయ కోణంలో పరిష్కరించాలనే డిమాండ్ వినిపిస్తున్నది.