రామాలయం విషయంలో లొల్లి.. కాంగ్రెస్​, సీపీఎం వర్గాల మధ్య ఘర్షణ

రామాలయం విషయంలో లొల్లి..   కాంగ్రెస్​, సీపీఎం  వర్గాల మధ్య ఘర్షణ

మధిర, వెలుగు : ఖమ్మం జిల్లా బోనకల్ మండలం గోవిందాపురం (ఎల్)​గ్రామంలో ప్రభుత్వ స్థలంలో నిర్మిస్తున్న రామాలయ నిర్మాణ విషయంలో కాంగ్రెస్, సీపీఎం వర్గాల మధ్య ఆదివారం గొడవ జరిగింది. ఆ స్థలంలో ఆలయ నిర్మాణం చేపట్టవద్దని మొదటినుంచీ సీపీఎం డిమాండ్​ చేస్తున్నది. ప్రస్తుతం టెంపుల్ ​నిర్మాణం పూర్తయి ప్రహరీ కడుతున్నారు. దీని కోసం గుంతలు తీశారు. ఈ గుంతలను ఆదివారం సీపీఎంకు చెందినవారు పూడ్చారు. దీన్ని కాంగ్రెస్​వర్గీయులు ప్రశ్నించారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఒకరిపై ఒకరు దాడులకు దిగడంతో ఇరువర్గాలకు గాయాలయ్యాయి. గాయపడిన వారు ఖమ్మం దవాఖానలో చికిత్స పొందుతున్నారు. బోనకల్​పోలీస్​స్టేషన్​లో ఒకరిపై ఒకరు కంప్లయింట్ ​చేసుకున్నారు. వైరా ఏసీపీ రెహమాన్​, మధిర సీఐ వసంతకుమార్, ఎస్ఐ సాయికుమార్​ రెండు పార్టీల వారిని బోనకల్​ పీఎస్​కు పిలిపించి మాట్లాడారు. వీడియో, సీసీ ఫుటేజీలను పరిశీలించి కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.