హైదరాబాద్, వెలుగు : బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిపై తయారు చేయించిన తమ ప్రచార కార్లను పోలీసులు అక్రమంగా ఎత్తుకెళ్లిపోయారని కాంగ్రెస్ మండిపడింది. శుక్రవారం రాత్రి గాంధీభవన్లో ఎవరూ లేని సమయంలో వచ్చి తమ ప్రాపర్టీలను తీసుకెళ్లి సీజ్ చేశారని ఆరోపించింది. ఈ మేరకు రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ఆఫీసర్ వికాస్ రాజ్కు పీసీసీ వైస్ ప్రెసిడెంట్ చామల కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని పార్టీ లీడర్లు సోమవారం ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ వైఫల్యాలపై గురువారం గాంధీభవన్ ఆవరణలో కార్ క్యాంపెయిన్ను ప్రారంభించామని, ఆ కార్లను గాంధీభవన్ ఆవరణలోనే పార్క్ చేసుకున్నామని, ఏ చట్టాన్నీ, నిబంధనలను అతిక్రమించలేదని వికాస్రాజ్కు చేసిన ఫిర్యాదులో వారు పేర్కొన్నారు.
అయితే, ఆ తర్వాతి రోజు రాత్రి గాంధీభవన్ ఆవరణలోకి ప్రవేశించిన పోలీసులు అక్రమంగా ఆ కార్లను సీజ్ చేసి బేగంబజార్ పోలీస్స్టేషన్కు తరలించారని పేర్కొన్నారు. దీనిపై పోలీసులు సరైన వివరణ ఇవ్వలేదని, ఈ ఘటన ప్రైవేటు ఆస్తుల రక్షణ హక్కును ఉల్లంఘించేలా ఉందని పేర్కొన్నారు. ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తమ డిమాండ్లకు ఆన్సర్ చేయాల్సిందిగా కోరారు. ‘‘గాంధీభవన్ పరిసరాల్లోకి ఎంటరై మా ఆస్తులను సీజ్ చేయడానికి గల కారణాలను రాతపూర్వకంగా చెప్పాలి. మా ప్రచారం చట్టబద్ధమే అయితే వెంటనే మా వాహనాలను మాకు అప్పగించాలి. పోలీసుల చర్యలు తప్పని తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని సీఈవోను కోరారు.