
- డెయిరీ చైర్మన్గా నేడు మధుసూదన్రెడ్డి ఎన్నిక
నల్గొండ/ఎల్బీనగర్, వెలుగు : నల్గొండ, రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం (మదర్ డెయిరీ) ఎన్నికల్లో కాంగ్రెస్ క్యాండిడేట్లు ఘన విజయం సాధించారు. హయత్నగర్లోని ఎస్వీ కన్వెక్షన్ సెంటర్లో శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్, ఆ తర్వాత కౌంటింగ్ నిర్వహించారు. నల్గొండ జిల్లాలో నాలుగు డైరెక్టర్ స్థానాలకు కాంగ్రెస్, బీఆర్ఎస్ తరపున నలుగురు చొప్పున, రంగారెడ్డి జిల్లాలో రెండు సీట్లకు నలుగురు పోటీ చేశారు. ఇందులో ఆలేరు నియోజకవర్గానికి చెందిన నలుగురు కాంగ్రెస్ క్యాండిడేట్లు, రంగారెడ్డి జిల్లాలో ఇద్దరు గెలిచారు. ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ప్రతిపాదించిన చైర్మన్ క్యాండిడేట్ గుడిపాటి మధుసూదన్రెడ్డికి 229 ఓట్లు రాగా, కల్లేపల్లి శ్రీశైలానికి 222, పుప్పాల నర్సింహులుకు 181, బత్తుల నరేందర్రెడ్డికి 177, అగ్రాల నర్సింహారెడ్డికి 242, మండలి జంగయ్యకు 232 ఓట్లు వచ్చాయి.
9కి చేరిన కాంగ్రెస్ బలం
మదర్ డెయిరీలో మొత్తం 15 మంది డైరెక్టర్లకు గానూ ఇప్పటివరకు 9 మంది పదవిలో ఉన్నారు. ఇందులో ఆరుగురు బీఆర్ఎస్ డైరెక్టర్లు కాగా, ముగ్గురు మాత్రమే కాంగ్రెస్ డైరెక్టర్లు ఉన్నారు. ఇప్పుడు కొత్తగా గెలిచిన ఆరుగురితో కాంగ్రెస్ బలం 9కి పెరిగింది. దీంతో ఇప్పటివరకు బీఆర్ఎస్ చేతిలో ఉన్న డెయిరీ ఇక కాంగ్రెస్కు దక్కనుంది. కాంగ్రెస్కు మెజార్టీ డైరెక్టర్లు ఉన్నందున చైర్మన్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. కొత్తగా ఎన్నికైన ఆరుగురు డైరెక్టర్ల పదవీకాలంపై శనివారం హయత్నగర్లోని డెయిరీ ఆఫీస్లో డ్రా తీయనున్నారు. ఆరుగురిలో ముగ్గురు నాలుగేళ్లు, మరో ముగ్గురు ఐదేళ్లు పదవిలో కొనసాగనున్నారు. డ్రా పూర్తైన తర్వాత చైర్మన్ ఎన్నిక నిర్వహించనున్నారు.
బీఆర్ఎస్కు షాక్
డెయిరీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంతో ఆలేరు నియోజకవర్గంలో బీఆర్ఎస్కు గట్టి షాక్ తగిలింది. పార్టీ నాయకత్వం, మాజీ మంత్రి జగదీశ్రెడ్డి కొంత చొరవ చూపినట్లయితే ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు వచ్చేవని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అయినప్పటికీ గెలుపు కోసం రెండు పార్టీలు పోటాపోటీగా ఖర్చు చేశారు.