
వంగూరు, వెలుగు: ప్రతి పల్లెకు బీటీ రోడ్లు వేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లురవి, కల్వకుర్తి, అచ్చంపేట ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ తెలిపారు. శుక్రవారం కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని జేపీ నగర్ నుంచి వంగూరు మండలం పోల్కంపల్లి వరకు, జంగారెడ్డిపల్లి నుంచి తిమ్మరాశిపల్లి మీదుగా రూ.25.50 కోట్లు, చారకొండ నుంచి చంద్రాయన్ పల్లి వరకు రూ.4.50 కోట్లతో చేపట్టే బీటీ రోడ్డు పనులకు, రూ.4.60 కోట్లతో నిర్మించే గోకారం–తురకలపల్లి బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పల్లెల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యం మెరుగుపరిచేందుకు ప్రతి పల్లెకు బీటీ రోడ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి పెట్టిందని చెప్పారు. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నా, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని తెలిపారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మెంబర్ ఠాకూర్ బాలాజీ సింగ్, ఆనంద్ కుమార్, విజయ్ కుమార్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సంజీవ్ యాదవ్, రవీందర్, రాజేశ్ రెడ్డి, లింగారెడ్డి, బాలు నాయక్, హనుమానాయక్, దున్న సురేశ్ పాల్గొన్నారు.
ఇంటింటికీ ఇందిరమ్మ రాజ్యం ఫలాలు..
ఉప్పునుంతల: ఇందిరమ్మ రాజ్యం ఫలాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయని, ఇది కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ తెలిపారు. మండల కాంగ్రెస్ సమావేశాన్ని ఉప్పర్పల్లిలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మేనిఫెస్టోలో ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విజయవంతమైందని తెలిపారు.
హామీల అమలును చూసి ప్రతిపక్ష నేతలు జీర్ణించుకోలేక లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించి సత్తా చాటాలని పిలుపునిచ్చారు. అనంతరెడ్డి, అరుణ నరసింహా రెడ్డి, ప్రతాపరెడ్డి, జగత్ రెడ్డి పాల్గొన్నారు.