
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హంతకులను విడుదల చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించడంపై కాంగ్రెస్ పార్టీ అసంతృప్తి వ్యక్తం చేసింది. సర్వోన్నత న్యాయస్థానం తీర్పును స్వాగతించడంలేదని ఆ పార్టీ కమ్యూనికేషన్స్ ఇన్చార్జి, జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ అన్నారు. సుప్రీం కోర్టు తీసుకున్న నిర్ణయం ఆమోదయోగ్యం కాదని అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు దేశ స్ఫూర్తికి అనుగుణంగా వ్యవహరించకపోవడం అత్యంత దురదృష్టకరమని అన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటను రిలీజ్ చేశారు.
రాజీవ్ గాంధీ హత్యకేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఆరుగురు నిందితులను విడుదల చేయాలని ఇవాళ సుప్రీంకోర్టు ఆదేశించింది. గతంలో హత్య కేసులో నిందితుడిగా ఉన్న పెరారివాలన్ కు నిర్దేశించిన గైడ్ లైన్సే మిగిలిన దోషులకు కూడా వర్తిస్తాయని తెలిపింది. 2022 మే 18న పెరరివాలన్ ను విడుదల చేస్తూ ఇచ్చిన తీర్పును మిగిలిన దోషులకు కూడా సుప్రీంకోర్టు వర్తింపజేసింది. దీంతో దోషులు నళిని, జయకుమార్, ఆర్పీ రవిచంద్రన్, రాబర్ట్ పియాస్, సుతేంద్ర రాజా, శ్రీహరన్ లను విడుదల చేయాలని ఆదేశాలిచ్చింది.