- వచ్చే 4 నెలల్లో 30 లక్షల సభ్యత్వాలు
- రేపటి నుంచి కాంగ్రెస్ డిజిటల్ మెంబర్ షిప్
- నవంబర్ 14 నుంచి 7 రోజులు జన జాగరణ పాదయాత్ర
- పీసీసీ మీటింగ్ లో నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: వచ్చే 4 నెలల్లో 30 లక్షల మెంబర్ షిప్లు ఇవ్వాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది. సోమవారం గాంధీభవన్లో డిజిటల్ మెంబర్ షిప్ని షురూ చేయనుంది. నవంబర్ 14 నుంచి ఏడు రోజులపాటు జన జాగరణ పాదయాత్ర చేపట్టనుంది. శనివారం గాంధీభవన్లో కాంగ్రెస్ రాష్ట్ర ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్లు జగ్గారెడ్డి, గీతారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి బోసు రాజు, సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి, కిసాన్ కాంగ్రెస్ నేత కోదండరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీటింగ్ తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలని వివరిస్తూ.. నవంబర్ 14 నుంచి ఏడు రోజుల పాటు జన జాగరణ పాదయాత్ర చేపడుతామని, కార్యకర్త స్థాయి నుంచి ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొంటారని తెలిపారు. నవంబర్ 9, 10వ తేదీల్లో మండల కాంగ్రెస్ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుల ట్రైనింగ్ క్యాంప్ నిర్వహిస్తున్నామన్నారు. 119 నియోజకవర్గాలకు కో ఆర్డినేటర్లని త్వరలో నియమిస్తామన్నారు.
మాణిక్కం ఠాగూర్.. వరుస మీటింగ్లు
రాష్ర్టంలో మరో నాలుగు రోజులపాటు మాణిక్కం ఠాగూర్ పర్యటించనున్నారు. ఆదివారం మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ఉదయం 9 గంటలకు నెక్లెస్ రోడ్ లో ఇందిర విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పిస్తారు. తర్వాత అటు నుంచి మహబూబ్నగర్ వెళ్లనున్నారు. సోమవారం గాంధీభవన్లో డిజిటల్ మెంబర్ షిప్ను ప్రారంభించి.. డీసీసీ, రాష్ట్ర నాయకులతో సమావేశం కానున్నారు. 2న నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్న డీసీసీ, అసెంబ్లీ స్థాయి, మండల, గ్రామ, బ్లాక్ స్థాయి నేతలతో భేటీ అవుతారు. 3న గాంధీభవన్లో పొలిటికల్ ఎఫైర్ కమిటీ సమావేశానికి హాజరవుతారు.