
- కొండా దంపతులపై ఆ జిల్లా ఎమ్మెల్యేల ఫిర్యాదు
- విచారణ కమిటీ వేయాలని నిర్ణయం
- నాలుగు రోజులు ఇక్కడే ఉండనున్న నటరాజన్
- 24 న పీఏసీ మీటింగ్.. అటెండ్ అవనున్న మీనాక్షి, సీఎం
హైదరాబాద్, వెలుగు: లోకల్ బాడీ ఎన్నికలు దగ్గరపడుతున్నందున పార్టీలో నేతల మధ్య సమన్వయం పెంచడంపై కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ ఫోకస్ పెట్టారు. ఆదివారం హైదరాబాద్ చేరుకున్న ఆమె నాలుగు రోజుల పాటు ఇక్కడే మకాం వేయన్నారు. మీనాక్షి నటరాజన్ వచ్చి రావడంతోనే వరంగల్ జిల్లా వివాదంపై దృష్టిపెట్టారు. ఆ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి, గండ్ర సత్యనారాయణ, డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, ఇతర నేతలు.. న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మీనాక్షి నటరాజన్ను కలిసి కొండా దంపతులపై ఫిర్యాదు చేశారు.
కొండా మురళిపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు సమాచారం. దీనిపై స్పందించిన మీనాక్షి నటరాజన్ .. కొండా మురళి కామెంట్లు ఇప్పటికే తన దృష్టికి వచ్చాయని, దీనిపై పీసీసీ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లాకు సంబంధం లేని నేతలతో విచారణ కమిటీ వేస్తానని, పారదర్శకంగా వాస్తవాలను తెలుసుకొని తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటానని చెప్పినట్లు సమాచారం. అలాగే పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ రచించిన “విధ్వంసం నుంచి వికాసం వైపు” పుస్తకాన్ని ఈ నెల 24 న గాంధీ భవన్ లో మీనాక్షి, సీఎం రేవంత్ రెడ్డి కలిసి రిలీజ్ చేయనున్నారు.
నియోజకవర్గాల్లో సమస్యలపై
ఇటీవలే గజ్వేల్ ప్రాంత కాంగ్రెస్ నేతలు సిద్దిపేట జిల్లా డీసీసీ చీఫ్ నర్సారెడ్డిని తొలగించాలని కోరుతూ గాంధీ భవన్ కు వచ్చి నిరసన వ్యక్తం చేశారు. దీనిపై కూడా ఆమె దృష్టి పెట్టారు. నేతల మధ్య కోఆర్డినేషన్ మరింత పెంచేందుకు రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల నాయకులతో ప్రత్యేకంగా సమావేశం కావాలని నిర్ణయించారు. దీనిపై ఆమె ఆదివారం గాంధీ భవన్లో పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవితో భేటీ అయ్యారు. మంగళవారం పీఏసీ కమిటీ సమావేశం అనంతరం వివాదాలు ఉన్న నియోజకవర్గాల నేతలతో ప్రత్యేక సమావేశానికి ఏర్పాట్లు చేయాలని మల్లు రవిని ఆదేశించారు.
స్థానిక ఎన్నికల్లో పంచాయతీ సంఘటన్ది కీలక పాత్ర: మీనాక్షి
త్వరలో జరగనున్న లోకల్ బాడీ ఎన్నికల్లో పంచాయతీ సంఘటన్ కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని మీనాక్షి స్పష్టం చేశారు. ఆదివారం సాయంత్రం గాంధీ భవన్ లో రాష్ట్ర రాజీవ్ గాంధీ పంచాయతీ సంఘటన్ సమావేశం జరిగింది. దీనికి చీఫ్ గెస్టుగా హాజరైన ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తుందని అన్నారు. పేద, మధ్య తరగతి, మహిళా, రైతు, యువత, విద్యార్థుల కోసం ఎన్నో పథకాలను కొనసాగిస్తుందని.. వీటిని పల్లెల్లోని ప్రతి ఇంటికి తీసుకెళ్లి ప్రజలకు వివరించాలని స్పష్టం చేశారు. ఇప్పటి నుంచే ఈ కమిటీ సభ్యులు ప్రజల్లోకి వెళ్లాలని దిశానిర్దేశం చేశారు.
నేడు వరుస సమావేశాలు
మీనాక్షి నటరాజన్ సోమవారం గాంధీ భవన్ లో వరుస సమావేశాలు ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటలకు పీసీసీ డీలిమిటేషన్ కమిటీ మీటింగ్, 11 గంటలకు జై బాపు, జై భీమ్ మీటింగ్, మధ్యాహ్నం 2 గంటలకు పీసీసీ సంవిధాన్ బచావో మీటింగ్, 3 గంటలకు పీసీసీ అబ్జర్వర్ల మీటింగ్ నిర్వహించనున్నారు.
ఈ నెల 24 న పీఏసీ కమిటీ మీటింగ్
పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశం ఈ నెల 24న జరగనుంది. పీఏసీ కమిటీ నియమించిన తర్వాత జరుగుతున్న మొదటిసారి ఇది. ఇందులో ఉన్న సభ్యులంతా పార్టీలో సీనియర్ నేతలు కావడంతో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. దీనికి మీనాక్షి నటరాజన్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, ఇతర ముఖ్య నేతలు హాజరుకానున్నారు.