ఆరు గ్యారంటీల అమలుపై కాంగ్రెస్​ సర్కారుకు క్లారిటీ లేదు : కిషన్ రెడ్డి

ఆరు గ్యారంటీల అమలుపై కాంగ్రెస్​ సర్కారుకు క్లారిటీ లేదు : కిషన్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: తెలంగాణకు బీఆర్ఎస్​అవసరం లేదని, ఆ పార్టీకి ఓటేస్తే మూసీలో పడేసినట్లేనని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్​జి.కిషన్​రెడ్డి అన్నారు. లోక్​సభ ఎన్నికల నోటిఫికేషన్​ వచ్చే నెలలో వస్తుందని, ఏప్రిల్​లో ఎన్నికలు ఉంటాయని ఆయన చెప్పారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని, మోదీ మూడోసారి ప్రధాని కావటం ఖాయమని అన్నారు. 

ఆదివారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని వివిధ పార్టీలకు చెందిన పలువురు నేతలు కొండా విశ్వశ్వర్ రెడ్డి ఆధ్వర్యలో బీజేపీ స్టేట్ ఆఫీస్ లో  కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడారు. రానున్న రోజుల్లో బీజేపీలో మరిన్ని చేరికలు ఉంటాయని, మోదీ నాయకత్వాన్ని మరింత బలపర్చాలని ప్రజలు అనుకుంటున్నారని తెలిపారు.  గత 9 ఏళ్ల నుంచి అవినీతికి ఆస్కారం లేకుండా దేశానికి మోదీ నీతివంతమైన పాలన అందిస్తున్నారని గుర్తు చేశారు. భారత్​ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిందని, యూకే లాంటి దేశాన్ని వెనక్కి నెట్టిందన్నారు. మోదీ ప్రధాని అయ్యాక 17 కోట్ల సభ్యత్వాలతో ప్రపంచంలో బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించిందని చెప్పారు. నరేంద్ర మోదీ  ప్రధాని కాకముందు అనేక రాష్ట్రాల్లో విద్యుత్ కోతలతో కటిక చీకట్లు అలుముకునేవని, ప్రస్తుతం  సంపూర్ణ విద్యుత్ ఇస్తూ మోదీ వెలుగులు నింపారన్నారు. ఎంపీ ఎన్నికల్లో  అనేక రాష్ర్టాల్లో కాంగ్రెస్ ఖాతా తెరవని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. యూపీఏ పాలనలో రూ.12 లక్షల కోట్ల అవినీతి జరిగిందని, కాగ్ రిపోర్ట్ ద్వారా బయటపడిందన్నారు.

బీఆర్ఎస్​ప్రభుత్వం ఒక్క ఇల్లు ఇవ్వలే..

తెలంగాణకు బీఆర్​ఎస్​అవసరం ఇక లేదని, లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటేస్తే మూసీకి ఓటేసినట్లే అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ఎంపీలతో తెలంగాణకు ఒరిగేదేం లేదన్నారు. ఆ పార్టీ ఎంపీ ఒక్కరు గెలిచినా.. వాళ్లు ఢిల్లీలో చేసేదేమీ లేదన్నారు. వీరి పాలనలో రాష్ర్టం అప్పులపాలైందని, ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని ఆయన గుర్తు చేశారు. నరేంద్ర మోదీ పాలనలో పేదప్రజలకు మౌలిక వసతులు కల్పించడంతో పాటు దేశ వ్యాప్తంగా 4 కోట్ల ఇండ్లు కట్టిస్తే.. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పేదలకు ఒక్క ఇల్లు రాలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుపై స్పష్టత లేదని, ప్రజలకు ఇచ్చిన హామీలు, గ్యారంటీలను ఎలా అమలు చేస్తారనే దానిపై ఒక విధానం లేదని, ఆర్థిక పరిస్థితిని ఎలా సరిదిద్దుతారనే దానిపై, ప్రాజెక్టులను ఎలా ముందుకుతీసుకెళ్తారనే విషయాలపై ఏం చెప్పలేకపోతోందని కిషన్​రెడ్డి విమర్శించారు.

కేంద్ర స్కీమ్ లపై క్యాంపెయిన్ చేయండి

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర స్కీమ్ లు, వాటి అమలు, రాష్ర్టానికి ఇచ్చిన ప్రాజెక్టులు, నిధులపై ఎక్కువ ప్రచారం చేయాలని కిషన్ రెడ్డి  సూచించారు. పార్టీ స్టేట్ ఆఫీసులో బీజేపీ  సోషల్ మీడియా వలంటీర్ల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో కిషన్​రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయడం..ఎన్నికల ప్రచారానికి పార్టీ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయడంపై వలంటీర్లకు సూచనలు చేశారు. ఎంపీ ఎన్నికల్లో బీజేపీ విజయవకాశాలు, స్థానిక పరిస్థితులను కిషన్ రెడ్డికి వలంటీర్లు తెలిపారు. 

150 దేశాల్లో అయోధ్య వీక్షణం

500 ఏండ్లుగా భారతీయులు ఎదురుచూస్తున్న అయోధ్యలో రామమందిర పునర్నిర్మాణం జరుగుతోందని, నాడు విదేశీ దురాక్రమణదారుడు బాబరు భారతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న అయోధ్య రామమందిరాన్ని కూల్చి వివాదస్పదమైన కట్టడాన్ని నిర్మించిండని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. రామమందిరం నిర్మాణం కోసం వేలాదిమంది సాధుసంతులు, హిందువులు, ప్రజలు ప్రాణత్యాగం చేసి ఉద్యమించారని, కోట్లాది మంది భారతీయులు ఎదురుచూస్తున్న అయోధ్యలో రామమందిర నిర్మాణం కల నరేంద్ర మోదీ నేతృత్వంలో సాకారమైందన్నారు. భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికత, హిందువుల ఆత్మగౌరవానికి ప్రతీక అయోధ్య రామమందిరం అని ఆయన తెలిపారు. సోమవారం బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాన్ని 150 దేశాల్లోని హిందువులందరూ వర్చువల్ గా వీక్షించనున్నారని, ఇది భారతీయులందరికీ గర్వకారణమని కిషన్ రెడ్డి వెల్లడించారు.