కొత్తగా 27 లక్షల మందికి రేషన్​.. పదేండ్ల పెండింగ్​ అప్లికేషన్లకు కాంగ్రెస్​ సర్కారులో మోక్షం

కొత్తగా 27 లక్షల మందికి రేషన్​.. పదేండ్ల పెండింగ్​ అప్లికేషన్లకు కాంగ్రెస్​ సర్కారులో మోక్షం
  • 2.83 కోట్ల నుంచి 3.10 కోట్లకు లబ్ధిదారులు
  • మరో 2 లక్షల కొత్త రేషన్​కార్డులకు గ్రీన్​ సిగ్నల్​
  • రాష్ట్రంలో 91.83 లక్షలకు చేరిన రేషన్​కార్డులు

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో రేషన్​ లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. గతంలో 2.83 కోట్ల  మంది లబ్ధిదారులు ఉండగా.. తాజాగా వారి సంఖ్య 3.10 కోట్లకు చేరింది. కాంగ్రెస్ సర్కారు హయాంలో రేషన్​ లబ్ధి దారుల ఎంపిక కోసం చేపట్టిన ప్రక్రియ ద్వారా కేవలం మూడు నెలల కాలంలోనే 27లక్షల మందికి పైగా కొత్తగా అర్హత సాధించారు. 

అదే విధంగా రేషన్​ కార్డులు గతంలో  కంటే మరో 2లక్షలు ​ పెరిగాయి. దీంతో రాష్ట్రంలో కార్డుల సంఖ్య 91.83 లక్షలకు చేరింది. జూన్​ నెలలోనే ఒకే దఫాలో మూడు నెలలకు సంబంధించిన 18 కిలోల సన్నబియ్యం ఒక్కో రేషన్​లబ్ధిదారుకు అందనున్నాయి. దీంతో కొత్త లబ్ధిదారుల్లో నూతనోత్సాహం నెలకొంది.

పెండింగ్ దరఖాస్తులు క్లియర్​

గత ప్రభుత్వం పెండింగ్​లో పెట్టిన లక్షలాది అప్లికేషన్లను సైతం ప్రజా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. గత బీఆర్‌‌‌‌ఎస్ ప్రభుత్వం పదేండ్లపాటు కొత్త రేషన్ కార్డుల ఎంపికను నిర్లక్ష్యం చేయడంతో దరఖాస్తులు భారీగా పేరుకుపోయాయి. దీంతో కాంగ్రెస్​ సర్కారు మార్పులు చేర్పులకు సంబంధించి పెండింగ్‌‌‌‌లో ఉన్న దాదాపు 20 లక్షల అప్లికేషన్లపై ఫీల్డ్​ లేవల్​లో వెరిఫికేషన్​ చేపట్టింది. 

వెరిఫికేషన్​ పూర్తి చేసుకుని అప్రూవల్ అయిన అప్లికేషన్లలో మార్పులకు చేర్పులకు సంబంధించి 18లక్షల మంది లబ్ధిదారులకు కొత్తగా రేషన్​కు అర్హత సాధించారు. పెండింగ్​ దరఖాస్తుల్లో 90శాతం మందికి లబ్ధి జరిగింది. దీంతో గత ఎన్నో ఏండ్లుగా పెండింగ్​లో ఉన్న అప్లికేషన్​లకు మోక్షం లభించినట్లయింది. ఇది కొత్త ప్రజా ప్రభుత్వం సాధించిన ఘనత అని సివిల్​ సప్లయ్స్​ వర్గాలు చెబుతున్నాయి. 

కొత్తగా మరో 2 లక్షల కార్డులు

కొత్త రేషన్​ కార్డుల కోసం ప్రజా ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజా పాలన ద్వారా  గ్రామసభలు, మండల కార్యాలయాలు, ఎంపీడీవో కార్యాలయాల ద్వారా లక్షలాది మంది దరఖాస్తు చేసుకున్నారు. అదే విధంగా ఆన్‌‌‌‌లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులతో పాటు గత ఫిబ్రవరి 17 నుంచి మీ సేవ ద్వారా వచ్చిన లక్షలాది  అప్లికేషన్లను వెరిఫికేషన్​ చేసి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ నిర్వహించింది. అదే విధంగా కొత్త రేషన్​ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న అప్లికేషన్లలో ఇప్పటి వరకు 2లక్షల అప్లికేషన్లకు అప్రూవల్​ ఇవ్వడంతో  రేషన్​ కార్డులకు ఆమోదం లభించింది. 

ఈ కార్డుల కింద మరో 9 లక్షల మంది లబ్ధిదారులకు రేషన్​ లబ్ధి చేకూరినట్లయింది. మిగతా అప్లికేషన్ల వెరిఫికేషన్​ ప్రక్రియ కొనసాగుతోంది. కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి సైతం వెరిఫికేషన్​ నిర్వహించి రేషన్​ అందేలా చర్యలు చేపడతామని సివిల్​ సప్లయ్స్​ అధికారులు చెబుతున్నారు.