పెద్దపల్లిలో కాంగ్రెస్ దూకుడు

పెద్దపల్లిలో కాంగ్రెస్ దూకుడు
  •    ఓటమితో కుదేలైన బీఆర్​ఎస్
  •     కీలక సమయంలో సిట్టింగ్ ​ఎంపీ దూరం
  •     సంస్థాగత బలోపేతంపై దృష్టిపెట్టని బీజేపీ
  •     విజయసంకల్పయాత్రకు అంతంతే స్పందన

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్​ దూకుడు మీద కనిపిస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో  ఏడింటికి ఏడు సెగ్మెంట్లను  క్లీన్ స్వీప్​ చేసిన ఆ పార్టీ, ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో నిలిచింది. కాంగ్రెస్​ నుంచి యువనేత గడ్డం వంశీ కృష్ణ టికెట్​ ఆశిస్తున్నారు. కాకా ఫ్యామిలీకి చెందిన ఆయనకు టికెట్​దక్కితే గెలుపు నల్లేరుపై నడకే అనే అభిప్రాయం ఉంది. ఇక 2018 అసెంబ్లీ ఎన్నికల్లో  7 సెగ్మెంట్లలో ఆరింటిని గెలుచుకున్న బీఆర్ఎస్​ అదే ఊపులో 2019లో పెద్దపల్లి ఎంపీ స్థానాన్ని తన ఖాతాలో వేసుకుంది.

కానీ , ప్రస్తుతం ఏడు అసెంబ్లీ స్థానాలను కోల్పోయిన గులాబీ పార్టీ పూర్తిగా డీలా పడింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పెద్ద ఎత్తున బీఆర్ఎస్​ క్యాడర్​ కాంగ్రెస్​లో చేరగా, చివరికి  సిట్టింగ్​ ​ఎంపీ వెంకటేశ్ ​నేత సైతం పార్టీ మారడంతో హైకమాండ్ ​దిక్కుతోచని స్థితిలో పడింది. ఇక బలమైన క్యాడర్ ​లేకపోవడం బీజేపీకి మైనస్​గా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క మంచిర్యాలలో తప్ప ఏ ఒక్కచోటా డిపాజిట్​ దక్కించుకోని ఆ పార్టీ కాంగ్రెస్​ను ఎదుర్కోవడం కష్టసాధ్యమనే చెప్పవచ్చు.

వ్యూహాత్మకంగా కాంగ్రెస్​ అడుగులు.. 

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు సెగ్మెంట్లను గెలుచుకున్న కాంగ్రెస్​ 56 శాతం ఓట్లను రాబట్టింది.  బీఆర్ఎస్​, బీజేపీ సాధించిన ఓట్లు కేవలం 37.5 శాతం కావడం, ఇప్పటికిప్పుడు ఓటర్ల వైఖరిలో మార్పు వచ్చే అవకాశం లేకపోవడంతో ​విజయంపై   కాంగ్రెస్ ధీమాగా ఉంది. రాజకీయంగా అనుకూల పరిస్థితులున్నప్పటికీ అభ్యర్థి విషయంలో రాజీపడి, ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వరాదన్నది హైకమాండ్​ఆలోచనగా కనిపిస్తోంది.  దీంతో ఇక్కడ బలమైన అభ్యర్థిని దించాలని ఆ పార్టీ పెద్దలు భావిస్తున్నారు. అదే సమయంలో  కాంగ్రెస్​ నుంచి పోటీకి కాకా ఫ్యామిలీ నుంచి గడ్డం వంశీకృష్ణ ఆసక్తి చూపుతున్నారు. ఈ​ నియోజకవర్గ అభివృద్ధిలో కాకా వెంకటస్వామి కృషి ఎంతో ఉంది.  

ప్రజల్లో, క్యాడర్‌‌లో  ఆ ఫ్యామిలీకి మంచి ఆదరణ ఉంది.  వెంకటస్వామి తనయులు వివేక్ ​వెంకటస్వామి, వినోద్​ ఇద్దరూ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూర్​, బెల్లంపల్లి నియోజకవర్గాల నుంచి భారీ మెజారిటీతో గెలిచారు. దీంతో వంశీకృష్ణకు టికెట్​ ఇస్తే విజయావకాశాలు మెండుగా ఉంటాయని క్యాడర్​లో చర్చ జరుగుతోంది. 

బీఆర్ఎస్​కు దెబ్బ మీద దెబ్బ.. 

అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం నుంచి బీఆర్ఎస్ ​ఇంకా తేరుకోలేదు. ఓటమి తర్వాత క్యాడర్​కు మనోధైర్యం కల్పించాల్సిన ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేలంతా ముఖం చాటేశారు. సొంత కార్యకలాపాల్లో మునిగి, క్యాడర్​కు  టచ్​లోకి కూడా రావడం లేదు. ఆ మధ్య పార్లమెంట్ ​నియోజకవర్గ స్థాయి మీటింగ్​కు వచ్చిన బాల్క సుమన్​ సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసి పత్తా లేకుండా పోయారు. ఆయన వ్యాఖ్యల వల్ల పార్టీకి లాభం కంటే నష్టమే జరిగిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్తున్నారు.

మాజీ ఎమ్మెల్యేల తీరుతో దాదాపు ఏడు నియోజకవర్గాల పరిధిలోని బీఆర్ఎస్​ నేతలు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో కారు దిగి, కాంగ్రెస్ ​కండువా కప్పుకున్నారు. ఇది చాలదన్నట్లు  సిట్టింగ్​ ఎంపీ వెంకటేశ్​ నేత సైతం బీఆర్ఎస్​కు రాజీనామా చేసి కాంగ్రెస్​లో చేరడంతో గులాబీ పార్టీ పెద్దపల్లి ఎంపీ స్థానంపై దాదాపుగా ఆశలు వదిలేసుకుంది. పోటీకి నేతలెవరూ ముందుకు రాకపోవడంతో  మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్​ను బరిలోకి దింపేందుకు బీఆర్ఎస్ ​ప్రయత్నిస్తోంది. సొంత నియోజకవర్గంలోనే ఓటమి పాలుకావడం ఆయనకు మైనస్​గా మారింది. 

క్యాడర్​ లేని బీజేపీ..

పెద్దపల్లి నియోజకవర్గంలో సంస్థాగతంగా బలంగా లేకపోవడం బీజేపీకి ప్రతికూల అంశం. అసెంబ్లీ ఎన్నికల్లో  ఒక్క మంచిర్యాలలో తప్ప మిగిలిన ఆరు నియోజకవర్గాల్లో కాషాయ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కలేదు. ఆ పార్టీకి వచ్చిన ఓట్లు 6.5 శాతం మాత్రమే. కాకపోతే మోదీ ఇమేజ్​, హిందూత్వ, అయోధ్యలో రామాలయ నిర్మాణం, ఇతరత్రా జాతీయ అంశాలు కలిసివస్తాయని బీజేపీ నేతలు ఆశిస్తున్నారు.

ప్రస్తుతం ఆ పార్టీ తరుపున పోటీచేసేందుకు బలమైన అభ్యర్థులెవరూ లేరు.  గతంలో పోటీచేసిన ఎస్​ కుమార్​తో పాటు బొడిగె శోభ లాంటి నేతలు టికెట్​ కోసం  ట్రై చేస్తున్నారు. ఇటీవల ఓ పార్టీలో చేరిన ఓ మహిళా నేత, తనకు టికెట్​ ఇస్తే వచ్చేందుకు రెడీగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.  మరోవైపు బీజేపీ  ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహిస్తున్న విజయసంకల్ప యాత్రకు పెద్దపల్లి నియోజకవర్గంలో కనీస ఆదరణ రాకపోవడంతో ఈ సీటుపై ఆ పార్టీ హైకమాండ్​ దాదాపు ఆశలు వదిలేసుకున్నదనే చెప్పవచ్చు!