
హైదరాబాద్, వెలుగు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని ఎందుకు మార్చారో ప్రజలకు చెప్పాలని పీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జి.నిరంజన్ అన్నారు. కేసీఆర్తో లాలూచీ పడేందుకే సంజయ్ను తప్పించి కిషన్రెడ్డిని నియమించారా? అని బీజేపీ హైకమాండ్ను ప్రశ్నించారు. డబ్బు వసూళ్లు కూడా సంజయ్ను తప్పించేందుకు కారణమైందా అని నిలదీశారు. బుధవారం ఆయన గాంధీభవన్లో మీడియాతో మాట్లాడారు. పార్టీ అధ్యక్షుడి మార్పు బీజేపీ అంతర్గత వ్యవహారమే అయినా.. దాని గురించి రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.
పుస్తెలమ్మి నామినేషన్ వేసిన సంజయ్.. పత్రికల్లో రూ.వందల కోట్లతో యాడ్లు ఇచ్చేవరకు ఎలా ఎదిగారంటూ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించడం అనుమానాలకు తావిస్తున్నదని చెప్పారు. ప్రజా సంగ్రామ యాత్ర పేరిట సంజయ్ రూ.500 కోట్లు వసూలు చేశారనే వార్తలు వస్తున్నాయన్నారు.