
న్యూఢిల్లీ: మణిపూర్ ఇష్యూపై పార్లమెంట్ లో ప్రశ్నిస్తామని లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. అక్కడ శాంతి నెలకొల్పేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామని చెప్పారు. ఇటీవల మణిపూర్ లో పర్యటించిన రాహుల్.. అక్కడి రిలీఫ్ క్యాంపులలో బాధితులతో మాట్లాడారు. ఆ వీడియోను గురువారం సోషల్ మీడియా ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ‘‘మణిపూర్ లో హింస చెలరేగినప్పటి నుంచి మూడుసార్లు అక్కడికి వెళ్లాను. దురదృష్టవశాత్తు అక్కడ ఇప్పటికీ పరిస్థితి కుదుటపడలేదు.
రాష్ట్రం ఇంకా రెండుగానే డివైడ్ అయి ఉంది. ఇండ్లు కాలిపోతున్నాయి. అమాయకుల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. వేలాది కుటుంబాలు రిలీఫ్ క్యాంపులలో తలదాచుకోవాల్సిన పరిస్థితి ఉంది” అని అందులో పేర్కొన్నారు. ప్రధాని మోదీ మణిపూర్ లో పర్యటించి ప్రజలతో మాట్లాడాలని, రాష్ట్రంలో శాంతి నెలకొల్పేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. కాగా, రాహుల్ గాంధీ పోస్టు చేసిన వీడియోను కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ ట్యాగ్ చేశారు. మణిపూర్ పై ప్రధాని మోదీ ఇంకెప్పుడు స్పందిస్తారు? అక్కడ శాంతి నెలకొల్పేందుకు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? అని ఆమె ట్విట్టర్ లో ప్రశ్నించారు.