4 వేల కిలోమీటర్లు నడిచిన రాహుల్ గాంధీ
ఇయ్యాల శ్రీనగర్లో సభ
శ్రీనగర్ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడోయాత్ర సోమవారం కాశ్మీర్లో ముగియనుంది. ఇవాళ శ్రీనగర్లోని ఎస్కే స్టేడియంలో నిర్వహించనున్న ముగింపు సభకు 23 ప్రతిపక్ష పార్టీల నేతలను ఆహ్వానించారు. ఇక ఆదివారం ఉదయం రాహుల్ గాంధీ శ్రీనగర్ శివారులోని పంథా చౌక్ నుంచి భారత్ జోడో యాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి లాల్ చౌక్ కు వెళ్లి చారిత్రక క్లాక్ టవర్ వద్ద మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ప్రియాంకా గాంధీ, పలువురు స్థానిక కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ ట్వీట్ చేస్తూ.. “లాల్ చౌక్ లో మువ్వన్నెల జెండాను ఎగురవేయడం ద్వారా నేను దేశానికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాను. విద్వేషం వీగిపోతుంది.. ప్రేమే జయిస్తుంది.. భారతావనికి కొత్త ఆశల మహోదయం ముందుంది ” అని పేర్కొన్నారు. కాగా, రాహుల్ గాంధీ అలుపెరుగని పాదయాత్ర వల్ల దేశం నలుమూలలా ప్రేమ సందేశం వ్యాపించిందని ప్రియాంకా గాంధీ అన్నారు.
కిందటేడాది సెప్టెంబర్ 7న మొదలు..
భారత్ జోడో యాత్రను కిందటేడాది సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో రాహుల్ ప్రారంభించారు.కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా చేపట్టిన ఈ యాత్రలో భాగంగా తెలంగాణ సహా 12 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల గుండా రాహుల్ గాంధీ నడిచారు. మొత్తం 145 రోజుల పాటు సాగిన ఈ యాత్రలో రాహుల్ గాంధీ 3,970 కిలోమీటర్లు నడిచారు.