
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని, అధికారంలోకి రాగానే బీఆర్ ఎస్ ప్రభుత్వం నాణ్యత లేకుండా నిర్మించిన డబుల్బెడ్రూం ఇళ్లను కూల్చివేయిస్తామని మాజీ మంత్రి షబ్బీర్అలీ పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లాలోని టేక్రియాల్ శివారులో ఉన్న డబుల్ బెడ్రూంల నాణ్యతపై ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, షబ్బీర్అలీలు చర్చకు రావాలని పరస్పరం సవాళ్లు ప్రతిసవాళ్లు విసురుకున్న విషయం విదితమే.
నాలుగు రోజుల క్రితం టేక్రియాల్ లోని ఇళ్లను పరిశీలించి, నాణ్యతగా లేవంటూ షబ్బీర్ ఆరోపించారు. లబ్ధిదారులు ఇళ్లలోకి దిగకముందే పగుళ్లు ఏర్పడుతుండటంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 50 ఏళ్ల పాటు మన్నికగా ఉంటాయని చెబుతున్న గంప గోవర్ధన్ ఆ ఇళ్లలో 50 రోజులు ఉండగలడా అని ప్రశ్నించారు. డబుల్ ఇళ్లు ఎప్పుడు కూలిపోతాయోనని ప్రజలు భయపడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వాటిని కూల్చి కొత్తవి కడతామని తెలిపారు. ఈ క్రమంలో ఇంజినీర్లతో చర్చకు వస్తావా అని గంప గోవర్ధన్ ప్రతిసవాల్ విసరడం జిల్లా రాజకీయాలను వేడెక్కించింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ స్థానిక నాయకులు పరస్పరం విమర్శించుకున్నారు. సవాలును స్వీకరించిన షబ్బీర్అలీ జూన్ 19 న టేక్రియాల్ చేరుకున్నారు. ఎమ్మెల్యే రాకపోవడంతో నిరసనకు దిగారు. ఈ సందర్భంగా అక్కడున్న మీడియాకు డబుల్ బెడ్రూం ఇళ్ల గోడలకు ఏర్పడిన పగుళ్లను, కర్రముక్కతో తడితే పెచ్చులూడుతున్న వైనాన్ని షబ్బీర్ ప్రత్యక్షంగా చూపించారు. సీఎం కేసీఆర్ సర్కార్ డబల్ బెడ్రూంలు కట్టడంలో విఫలమైందని విమర్శించారు.