- మహాత్ముడి పేరును తుడిచిపెట్టేందుకు కేంద్రం యత్నం: ఖర్గే
- ‘జీ రామ్ జీ’ అంటే ఏమిటో నాకు తెలియదు: రాహుల్
- ఢిల్లీలో ఉపాధి హామీ కార్మికుల సదస్సులో కాంగ్రెస్ నేతల స్పీచ్
న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్రజల స్మృతిలోంచి మహాత్ముడి పేరును తుడిచిపెట్టే ప్రయత్నం చేస్తున్నదని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. గ్రామ స్వరాజ్యాన్ని బలహీనపరిచే కుట్ర చేస్తున్నదని అన్నారు. దేశంలోని అణగారిన, బలహీన వర్గాల ప్రజలను మళ్లీ వెట్టిచాకిరీలోకి నెట్టడానికే మోదీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని అంతం చేస్తున్నదని విమర్శించారు.
ఎంజీఎన్ఆర్ఈజీఏ పేరును ‘వీబీ జీ రామ్ జీ'గా మార్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు. దీనిపై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
జనవరి 28 నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశంపై గళమెత్తుతామని తెలిపారు. గురువారం ఢిల్లీలో జరిగిన ఉపాధి హామీ కూలీల సదస్సులో ఖర్గే మాట్లాడారు. ‘‘నరేంద్ర మోదీ కేవలం ఓట్ల కోసమే ‘నేను చాయ్వాలాను’ అని చెప్పుకుంటారు’’ అని వ్యాఖ్యానించారు.
యూపీఏ కాలం నాటి పాత ఉపాధి హామీ స్కీమ్ను పూర్తిస్థాయిలో పునరుద్ధరించే వరకు కాంగ్రెస్ పోరాడుతుందని స్పష్టం చేశారు. ‘‘మన పోరాటం చాలా సుదీర్ఘమైనది. కేవలం సత్యాగ్రహాలు..నినాదాలు చేస్తే సరిపోదు. ప్రభుత్వం కొత్త చట్టాలను వెనక్కి తీసుకుని, పాత ఎంజీఎన్ఆర్ ఈజీఏను తిరిగి పునరుద్ధరించే వరకు మన పోరాటం కొనసాగుతుంది” అని తెలిపారు.
పేదల హక్కులను కేంద్రం హరిస్తున్నది..
కేంద్రంలోని బీజేపీ సర్కారు ఎంజీఎన్ఆర్ఈజీఏ పేరు మార్చి ‘వీబీ జీ రామ్ జీ’ అనే కొత్త చట్టాన్ని తేవడాన్ని కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ తప్పుబట్టారు. పేదల పని హక్కులను మోదీ సర్కారు హరిస్తున్నదని ఆరోపించారు. ఉపాధి హామీ కూలీల సదస్సులో రాహుల్ మాట్లాడారు.
మూడు నల్ల వ్యవసాయ చట్టాల వెనుక ఉన్న ఉద్దేశమే, ఇప్పుడు ఉపాధి హామీ చట్టం పేరు మార్పు వెనుక కూడా ఉందన్నారు. కొత్త చట్టం ద్వారా ఏ రాష్ట్రానికి ఎంత నిధులు ఇవ్వాలో కేంద్రమే నిర్ణయిస్తుందని, దీనివల్ల బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఎక్కువ, ప్రతిపక్ష రాష్ట్రాలకు తక్కువ నిధులు వెళతాయన్నారు.
దేశ సంపదనంతా కొద్దిమంది ధనవంతుల చేతుల్లో పెట్టడమే బీజేపీ లక్ష్యమని, పేదలు (ముఖ్యంగా దళితులు, ఓబీసీలు, గిరిజనులు) ధనవంతులపై ఆధారపడి బతికేలా చేస్తున్నారని ఆరోపించారు. ‘వీబీ జీ రామ్ జీ’ చట్టానికి వ్యతిరేకంగా పేదలందరూ ఏకం కావాలన్నారు.
ప్రతీది ప్రధాని మాత్రమే చేయాలనే కొత్త సిద్ధాంతం
ఎంజీఎన్ఆర్ఈజీఏ అనేది పేదలకు హక్కులు కల్పించే పథకం అని రాహుల్గాంధీ తెలిపారు. పని కావాల్సిన వారికి పని కల్పించాలనే ఆలోచనతో దీనిని కాంగ్రెస్ హయాంలో తీసుకొచ్చామని గుర్తుచేశారు. దేశంలో రాచరిక పాలనను ప్రవేశపెట్టాలని బీజేపీ సర్కారు భావిస్తున్నదని అన్నారు.
గతంలోనూ రైతుల హక్కులను కాలరాసేందుకు కేంద్రం వ్యవసాయ రంగంలో మూడు నల్ల చట్టాలను తెచ్చిందని.. వాటి విషయంలో రైతులంతా ఏకమై పోరాడినట్టే.. ఇప్పుడు ఉపాధి హామీ స్కీమ్పునరుద్ధరణకు కూడా కలిసి పోరాడదామని పిలుపునిచ్చారు.
