- కాంగ్రెస్ నేతలకు తేల్చి చెప్పిన సునీల్ కనుగోలు
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలను కలుపుకుపోవాలె
- పీఏసీ సమావేశంలో పార్టీ పరిస్థితులపై ప్రజెంటేషన్
- ఆగస్టు 15న ఖర్గే అధ్యక్షతన ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గర్జన!
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో నేతలు గొడవలు పడితే పార్టీకి తీరని నష్టమని, ఐక్యంగా ఉండి జనాల్లోకి వెళ్లాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు పార్టీ నేతలకు సూచించినట్టు తెలిసింది. సమన్వయంతో పనిచేయాలని చెప్పినట్టు సమాచారం. పార్టీని బలోపేతం చేసే విషయంపై ఎలా ముందుకు పోవాలన్న దానిపై ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆదివారం గాంధీభవన్లో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్ రావ్ ఠాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ) సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో పాల్గొన్న కనుగోలు.. అరగంటకుపైగా పార్టీ స్థితిగతులు, బలాబలాలపై ప్రజెంటేషన్లో వివరించారు. ‘ఎలక్షన్ 2023’ పేరుతో అన్ని నియోజకవర్గాల్లోని పరిస్థితులను వివరించారని పార్టీ నేతలు చెప్తున్నారు. ఎన్నికల కోసం వంద రోజుల ప్లాన్ను అమలు చేయాల్సిందిగా సూచించారని అంటున్నారు. ప్రస్తుతం బీసీ కార్డ్ తెరపైకి వచ్చినందున.. అన్ని సామాజిక వర్గాల వారికి సరైన ప్రాతినిధ్యం ఇవ్వాల్సిందిగా ఆయన తేల్చి చెప్పినట్టు తెలుస్తున్నది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలను కలుపుకుని పోవాలని చెప్పినట్టు సమాచారం. ఆయా వర్గాల ప్రజలను కాంగ్రెస్ వైపు ఆకర్షించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలు, పథకాలపై కసరత్తు చేయాలని.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఉపయోగపడేలా డిక్లరేషన్లను ప్రకటించాల్సిందిగా కనుగోలు సూచించినట్టు సమాచారం.
ఐదు అంశాలు జనాల్లోకి..
మరోవైపు ఐదు అంశాలను జనాల్లోకి బాగా తీసుకెళ్లేలా పార్టీ నేతలకు సునీల్ కనుగోలు దిశానిర్దేశం చేసినట్టు తెలిసింది. రూ.500కే గ్యాస్ సిలిండర్, రూ.4000 పింఛన్, రూ.2 లక్షల రుణమాఫీ, 2 లక్షల ఉద్యోగాలు, పేదలకు ఇండ్లు వంటి అంశాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని చెప్పినట్టు సమాచారం. ఇప్పటికే రేవంత్, భట్టి విక్రమార్క పాదయాత్రలు చేశారు. అయితే, అందులో అన్ని నియోజకవర్గాలూ కవర్ కాలేదు. కాబట్టి, ఆయా నియోజకవర్గాలతోసహా మిగిలిన అన్ని నియోజకవర్గాల్లోనూ బస్సు యాత్ర చేపట్టేలా సునీల్ కనుగోలు సూచనలు చేసినట్టు నేతలు చెప్తున్నారు. అందరూ కలిసి యాత్ర చేయాలని ఆయన చెప్పినట్టు తెలిసింది. చేరికలపైనా ఆయన ప్రజెంటేషన్లో వివరించినట్టు తెలిసింది. పార్టీలో ఎవరు చేరితే బాగుంటుంది.. బలపడుతుందన్న దానిపైనా నివేదికను ఇచ్చినట్టు సమాచారం. మరోవైపు నేతలు ఏది పడితే అది మాట్లాడకూడదని కూడా సూచించినట్టు సమాచారం.
కొల్లాపూర్ సభకు ప్రియాంక
ఈ నెల 30న కొల్లాపూర్లో నిర్వహించనున్న సభపైనా పీఏసీ మీటింగ్లో చర్చించినట్టు తెలిసింది. ఆ సభకు వచ్చేందుకు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ ఓకే చెప్పారని పార్టీ నేతలు చెప్పారు. మరోవైపు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను ఆకర్షించేందుకు ఓ భారీ బహిరంగ సభను కాంగ్రెస్ ప్లాన్ చేస్తున్నది. ఆగస్టు 15న భారీ సభను నిర్వహించేందుకు పీఏసీ మీటింగ్లో నేతలు నిర్ణయించినట్టు సమాచారం. ఆ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని ఆహ్వానించాలని పార్టీ నేతలు తీర్మానించారు. దీనిపై రెండ్రోజుల్లో పార్టీ సబ్కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. మరోవైపు బస్సు యాత్ర తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని పార్టీలోని కీలక నేత ఒకరు చెప్పారు. ఈ యాత్ర పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ నేతృత్వంలో జరుగుతుందని తెలిపారు. బస్సు యాత్ర సెప్టెంబర్లో మొదలు పెట్టే అవకాశం ఉందని అంటున్నారు. ఈ యాత్రపైనా ఒక సబ్ కమిటీని పార్టీ ఏర్పాటు చేయనుంది. ఎక్కడి నుంచి ప్రారంభించాలి.. ఎన్ని నియోజకవర్గాల్లో నిర్వహించాలన్న దానిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాగా, ఈ సమావేశంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్లు మహేశ్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, జగ్గారెడ్డి, ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు సంపత్ కుమార్, చిన్నారెడ్డి, దామోదర రాజనర్సింహ, రేణుకా చౌదరి, బలరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.
తొమ్మిదేండ్లుగా దళితులు, బీసీలు, మైనార్టీలకు అన్యాయం మధు యాష్కీ గౌడ్
తొమ్మిదేండ్లుగా కేసీఆర్ సర్కారు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను మోసం చేస్తున్నదని పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం చేస్తుందో చెప్పేందుకు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గర్జన సభను నిర్వహిస్తామని తెలిపారు. పీఏసీ సమావేశం అనంతరం ఆయన గాంధీభవన్లో మీడియాతో మాట్లాడారు. ఆగస్టు 15న ఖర్గే అధ్యక్షతన గర్జన ఉంటుందన్నారు. ఈ నెల 30న కొల్లాపూర్లో నిర్వహించనున్న బహిరంగ సభకు ప్రియాంక గాంధీ వస్తున్నారని చెప్పారు. చేయూత కింద కాంగ్రెస్ ప్రకటించిన రూ.4000 పింఛన్ సత్ఫలితాలను ఇస్తున్నదని ఆయన చెప్పారు. వికలాంగులకు పింఛన్ను రాష్ట్ర సర్కారు రూ.4016కు పెంచడం కాంగ్రెస్ విజయమేనన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ (ముస్లిం, క్రిస్టియన్), మహిళా డిక్లరేషన్లపై సబ్ కమిటీ వేస్తున్నామని మాజీ మంత్రి, పీఏసీ కన్వీనర్ షబ్బీర్ అలీ తెలిపారు. ఈ 5 డిక్లరేషన్లపై స్కాలర్స్, నిపుణులతో రీసెర్చ్ చేయిస్తామన్నారు. బస్సు యాత్రకు సంబంధించి అనుభవం ఉన్న నేతల ద్వారా అధ్యయనం చేస్తున్నామని చెప్పారు. మణిపూర్లో 80 రోజుల నుంచి జరుగుతున్న దారుణాలపైనా పీఏసీ మీటింగ్లో చర్చించామన్నారు. మణిపూర్ ప్రభుత్వాన్ని రద్దు చేసి శాంతిని నెలకొల్పాలని పీఏసీ తీర్మానం చేసిందన్నారు.