-
కడియం, పల్లా, రాజాసింగ్లపై డీజీపీకి కాంగ్రెస్ ఫిర్యాదు
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ ప్రజాప్రభుత్వాన్ని కూల్చేందుకు బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు కుట్ర చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు నెలలు, ఏడాదిలోపే కూలిపోతుందని బీఆర్ఎస్ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్చేసిన కామెంట్లను గుర్తు చేస్తూ.. కాంగ్రెస్ నేతలు మంగళవారం డీజీపీకి ఫిర్యాదు చేశారు.
ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఫిర్యాదులో పీసీసీ జనరల్సెక్రటరీలు పున్నా కైలాష్, చారుకొండ వెంకటేశ్, చిలుక మధుసూదన్ రెడ్డిలు కోరారు. వారిపై కేసులు పెట్టి జైలుకు పంపించాలని విజ్ఞప్తి చేశారు. అంతకు ముందు వారు గాంధీభవన్లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వంద గంటలు కూడా కాకముందే ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు పన్నుతున్నారని పున్నా కైలాష్ ఆరోపించారు.
ఎమ్మెల్యేల కొనుగోలు కేంద్రంలా బీఆర్ఎస్ పనిచేస్తున్నదని విమర్శించారు. ప్రజా ప్రభుత్వాన్ని కూల్చేందుకు పెద్ద కుట్రలే చేస్తున్నారని చారుకొండ వెంకటేశ్అన్నారు. కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్రెడ్డి మీద క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు. కుటుంబ పాలనపై విరక్తి చెంది ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చారన్నారు. ఆరు గ్యారెంటీలను అమలు చేస్తారన్న నమ్మకంతో ప్రజలు తమకు అవకాశం ఇచ్చారని మధుసూదన్ రెడ్డి అన్నారు.
పల్లా రాజేశ్వర్రెడ్డి అక్రమాస్తులు, ఫేక్ యూనివర్సిటీ తతంగాలను బయట పెడతామని హెచ్చరించారు. అన్నింటి మీదా సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేస్తుంటే.. జైలుకు పోతామన్న భయం బీఆర్ఎస్ నేతలకు పట్టుకుందన్నారు.