
- సీనియార్టీతోపాటు సిన్సియారిటీని చూసి పదవులిస్తం: మీనాక్షి నటరాజన్
- పనిచేసే వారికి తగిన గుర్తింపు ఉంటుందని వెల్లడి
- పార్టీ సంస్థాగత నిర్మాణంపై ఫోకస్ పెట్టాలన్న పీసీసీ చీఫ్
- పీసీసీ అబ్జర్వర్లు, డీసీసీ అధ్యక్షులతో జూమ్ మీటింగ్
హైదరాబాద్, వెలుగు: సామాజిక న్యాయానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని, దాని ఆధారంగానే ఇటు పార్టీలో అటు ప్రభుత్వంలో పదవుల పంపిణీ జరుగుతుందని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ అన్నారు. పార్టీలో సీనియారిటీతో పాటు సిన్సియారిటీని ప్రాతిపదికగా తీసుకొని పదవులు ఇస్తామని స్పష్టం చేశారు. శుక్రవారం పీసీసీ అబ్జర్వర్లు, అన్ని జిల్లాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులతో మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ జూమ్ మీటింగ్లో మాట్లాడారు.
నియోజకవర్గాల వారీగా పీసీసీ అబ్జర్వర్లు ఇచ్చిన నివేదిక ఆధారంగా జిల్లా, మండల అధ్యక్షులను ఏ ప్రాతిపదికన నియమించాలి? ఎవరిని నియమించాలి? అనే అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం పార్టీ నేతలను ఉద్దేశించి మీనాక్షి నటరాజన్ మాట్లాడారు. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆలోచనకు అనుగుణంగా సమాజంలో ఎవరి వాటా వారికే అనే సిద్ధాంతంతో ముందుకు సాగుతామని చెప్పారు. ఇప్పటి వరకు ఇచ్చిన ప్రతి పదవిలోనూ సామాజిక న్యాయం పాటించామని, ఇకపై కూడా ఇదే పద్ధతిని పాటిస్తామని అన్నారు.
కాంగ్రెస్ పార్టీలో పనిచేసే వారికి తగిన గుర్తింపు ఉంటుందని, ఈ విషయంలో ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పార్టీ నేతలు కాంగ్రెస్ పటిష్టత కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? ఇప్పటి వరకు చేపట్టిన కార్యక్రమాలు ఏమిటి? ఎవరి పనితీరు ఎలా ఉంది? తదితర అన్ని నివేదికలు తమ వద్ద ఉన్నాయని ఆమె స్పష్టం చేశారు. రాబోయే లోకల్ బాడీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పార్టీని సంస్థాగతంగా బూత్ స్థాయిలో బలోపేతం చేయాలని కోరారు. ఏడాదిన్నరగా రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని సూచించారు.
ప్రభుత్వ పథకాలను ప్రతి వ్యక్తికి వివరించాలి: మహేశ్గౌడ్
త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నందున పార్టీ నేతలు ఇప్పటి నుంచే జనంలోకి వెళ్లాలని పీసీసీ చీఫ్మహేశ్ గౌడ్ సూచించారు. ప్రభుత్వ పథకాలను ప్రతి వ్యక్తికి వివరించాలన్నారు. గ్రామ స్థాయిలో పార్టీ సంస్థాగత నిర్మాణం జరగాలని, పార్టీ పటిష్టతకు పకడ్బందీగా, ప్రణాళిక బద్ధంగా కార్యాచరణ చేపట్టాలని కోరారు. జిల్లా, మండల స్థాయిలో పార్టీ కమిటీలను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేలా పార్టీ అబ్జర్వర్లు చర్యలు తీసుకోవాలని కోరారు.
పార్టీ కో ఆర్డినేటర్లు, అబ్జర్వర్ల పనితీరు బాగుందని ప్రశంసించారు. పార్టీ పటిష్టత కోసం చిత్తశుద్ధితో పనిచేసే వారికి పదవులు వస్తాయని స్పష్టం చేశారు. జై బాపు, జై భీం, జై సంవిధాన్ కార్యక్రమాలను రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిర్వహించామని చెప్పారు. దేశంలో ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలోనే ఈ ప్రోగ్రాం అనుకున్న స్థాయిలో సక్సెస్ అయిందన్నారు. ఈ ప్రోగ్రాం అమలులో తెలంగాణను ఆదర్శంగా తీసుకోవాలని ఇతర రాష్ట్రాల నేతలకు కాంగ్రెస్ అగ్రనేతలు చెప్పడం సంతోషాన్ని ఇస్తుందన్నారు.