
- విభేదాలు పక్కనపెట్టి సమన్వయంతో పనిచేయాలి: మీనాక్షి నటరాజన్
- స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించాలి
- ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
- త్వరలోనే జిల్లాల్లో పర్యటించి సమస్యలు తెలుసుకుంట
- ఈ నెల 30లోపు పార్టీ పదవులన్నీ భర్తీ చేస్తామని వెల్లడి
- కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలకు పార్టీ స్టేట్ ఇన్చార్జ్ దిశానిర్దేశం
- నేడు పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశం
హైదరాబాద్, వెలుగు: పార్టీ నేతలంతా కలిసికట్టుగా పని చేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధిస్తామని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ అన్నారు. విభేదాలు పక్కనపెట్టాలని సూచించారు. సీనియర్లు, జూనియర్లు సమన్వయంతో కలిసి ముందుకెళ్లాలన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత నేతలపైనే ఉందని తెలిపారు. త్వరలోనే పది ఉమ్మడి జిల్లాల్లో పర్యటిస్తానని చెప్పారు. పార్టీ పరిస్థితిని స్వయంగా తెలుసుకుంటానని స్పష్టం చేశారు. గాంధీభవన్లో పార్టీ నేతలు, కార్యకర్తలు, కో ఆర్డినేటర్లతో వరుసగా సోమవారం సమావేశం అయ్యారు. ముందుగా పీసీసీ డీ లిమిటేషన్ మీటింగ్ నిర్వహించారు. తర్వాత జై బాపు, జై భీం కోఆర్డినేటర్లతో, ఆ తర్వాత పీసీసీ సంవిధాన్ బచావో సమావేశంలోపాల్గొన్నారు.
చివరగా పీసీసీ అబ్జర్వర్లతో భేటీ అయ్యారు. ఈ సమావేశాలకు పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ అధ్యక్షత వహించగా.. మీనాక్షి నటరాజన్ చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. డిప్యూటీ సీఎం భట్టితో పాటు పలువురు కీలక నేతలు అటెండ్ అయ్యారు. ఈ సందర్భంగా మీనాక్షి నటరాజన్ మాట్లాడారు. ‘‘ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం, ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణన, రైతు భరోసా వంటి పథకాల గురించి ఇంటింటికి వెళ్లి వివరించాలి. పదవులపరంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇస్తున్న ప్రాధాన్యత తెలియజేయాలి. స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలను కోరాలి’’అని మీనాక్షి నటరాజన్ అన్నారు.
గ్రామాల్లో రాత్రి బస చేయాలి
నియోజకవర్గ స్థాయి నేతలు.. గ్రామాల్లో రాత్రి బస చేయాలని మీనాక్షి నటరాజన్ అన్నారు. ‘‘రాత్రి గ్రామంలో పడుకుని.. ఉదయం పరిసరాలను శుభ్రం చేయాలి. ‘‘రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ప్రోగ్రామ్లో పాల్గొనేలా చూడాలి. ఈ నెల 30లోపు పార్టీపరమైన పదవులను భర్తీ చేసే ప్రక్రియను పీసీసీ చీఫ్ పూర్తి చేయాలి. నామినేటెడ్ పోస్టులను కూడా వీలైనంత త్వరగా భర్తీ చేస్తాం. జిల్లా, మండల అధ్యక్షులను త్వరలోనే నియమిస్తాం.
మండల అధ్యక్షుల పదవుల కోసం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఓసీలను పరిగణనలోకి తీసుకోవాలి. అందులో ఒక్కో సామాజికవర్గం నుంచి ఒక్కో పేరును సూచించాలి. ప్రతి సెగ్మెంట్ నుంచి నామినేటెడ్ పోస్టు కోసం రెండేసీ పేర్లను సిఫార్సు చేయాలి’’అని మీనాక్షి నటరాజన్ అన్నారు. కాగా, వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు సోమవారం గాంధీభవన్లో పీసీసీ చీఫ్ మహేశ్గౌడ్ను కలిశారు. మంత్రి కొండా సురేఖ దంపతులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే రేవూరి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, పార్టీ నేతలు కోరారు.
నేడు పీఏసీ మీటింగ్
గాంధీభవన్లో మంగళవారం ఉదయం 11 గంటలకు పీసీసీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (పీఏసీ) మీటింగ్ జరగనున్నది. పీఏసీ ఏర్పాటయ్యాక ఇది తొలి సమావేశం కావడంతో అందరి దృష్టి దీనిపైనే ఉన్నది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే చాన్స్ ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ వ్యూహం, పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టుల భర్తీ, లీడర్ల మధ్య ఉన్న విభేదాలు వంటి పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ అధ్యక్షతన జరగనున్న ఈ మీటింగ్లో పార్టీ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కమిటీ సభ్యులు పాల్గొననున్నారు.
పీఏసీ మీటింగ్కు ముందు ఉదయం 10 గంటలకు పీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం జరగనున్నది. కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షత వహిస్తారు. వరంగల్ జిల్లాలో నెలకొన్న విభేదాలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నది. మధ్యాహ్నం కొత్తగా నియమితులైన పీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులకు నియామకపత్రాలు అందించనున్నారు.