
హైదరాబాద్, వెలుగు: రాబోయే పదేండ్లలో తాను పీసీసీ చీఫ్, సీఎం అవుతానని కాంగ్రెస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. పీసీసీ చీఫ్ విషయంపై ఇప్పటి వరకు తనను ఎవరూ సంప్రదించలేదన్నారు. శుక్రవారం గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. పదవి విషయంలో సోనియా, రాహుల్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానన్నారు. పార్టీ హైకమాండ్ తనకు గాంధీ భవన్ అటెండర్ పోస్టు ఇచ్చినా.. అందుకు కూడా సిద్ధమేనన్నారు. మూడోసారి అధికారంలోకి వచ్చిన ప్రధాని మోదీ, దేశ ప్రజలకు ఉపయోగపడే విషయాలు మాట్లాడుతారని ప్రజలు ఎదురు చూస్తే.. 50 ఏండ్ల కిందటి ఎమర్జెన్సీని ప్రస్తావించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.
ఎమర్జెన్సీ తర్వాత జరిగిన ఎన్నికల్లో దేశ ప్రజలు 353 సీట్లతో అత్యధిక మెజార్టీని ఇచ్చారంటే.. ఎమర్జెన్సీని మరిచిపోయినట్టే కదా అన్నారు. ఈ విషయాన్ని మోదీ గుర్తుంచుకోవాలన్నారు. మోదీ పదే పదే ఎమర్జెన్సీని గుర్తు చేస్తున్న తీరును సంఘ్ చీఫ్ భగవత్ కూడా తప్పుపట్టారని అన్నారు. పాకిస్తాన్ తో బంగ్లాదేశ్ తరఫున ఇందిర యుద్ధం చేసి విజయం సాధించిన సమయంలో ఆమెను దుర్గమ్మ తల్లిగా మాజీ ప్రధాని వాజ్ పేయ్ కొనియాడిన విషయాన్ని మోదీ గుర్తుంచుకోవాలన్నారు.