హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు గవర్నమెంట్ఉద్యోగుల ఓట్లపై గురిపెట్టాయి. వాళ్ల డిమాండ్లను మేనిఫెస్టోలో పెట్టి ఓట్లు రాబట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఉద్యోగులు కూడా తమ ప్రధాన డిమాండ్ అయిన ఓల్డ్ పెన్షన్ స్కీమ్ సాధనపైనే దృష్టిపెట్టాయి. ఎలక్షన్ షెడ్యూల్ ముందువరకు ప్రభుత్వం నుంచి ఓపీఎస్పై ప్రకటన ఇప్పించుకోవాలని చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో వారిలో కొంత నిరాశ ఉంది.
దీంతో వారంతా ఏ పార్టీ ఓపీఎస్ను మేనిఫెస్టోలో పెడుతుందో ఆ పార్టీవైపు ఉండాలని సూత్రప్రాయంగా నిర్ణయించుకున్నట్టు తెలిసింది. దాదాపు రెండున్నర లక్షల మంది వరకు ఉన్న ఉద్యోగుల ఓట్లు అన్ని పార్టీలకూ కీలకం. అందుకే వారి డిమాండ్లకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. అధికారంలోకి రాగానే సీపీఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేస్తామని, ఈ అంశాన్ని మేనిఫెస్టోలో చేరుస్తామని కాంగ్రెస్ పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఎన్నికలకు ముందే నిర్ణయం తీసుకొనే చాన్స్ ఉన్నా.. బీఆర్ఎస్ ఈ విషయాన్ని నాన్చింది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్నివేదిక ఇచ్చినప్పటికీ ఎలాంటి ప్రకటనా చేయలేదు.
రద్దు అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే..
సీపీఎస్ను రద్దు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్ మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) చట్టంలో ఈ విషయాన్ని చేర్చారు. దీంతో రాష్ట్రంలో బీజేపీ మినహా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకే ఓపీఎస్ రద్దు అవకాశం ఉందని ఉద్యోగులు చెబుతున్నారు. రాజస్థాన్, చత్తీస్గఢ్, జార్ఖండ్, హిమాచల్ప్రదేశ్, పంజాబ్, కర్నాటక రాష్ట్రాలు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే సీపీఎస్ను రద్దు చేశాయి.
ఇక తమిళనాడు ఎన్పీఎస్ ఖాతాకు ఒక్క పైసా కూడా జమ చేయడం లేదు. మన రాష్ట్రంలో ఓపీఎస్ కోసం ఉద్యోగులు ఏండ్లుగా పోరాటం చేస్తున్నారు. పాత, కొత్త అందరు ఉద్యోగులు కలిస్తే మొత్తం ఓపీఎస్ కోరుకునే వాళ్ల సంఖ్య 3 లక్షలకు వరకు ఉంటుంది. ఇటీవల సీపీఎస్ రద్దు కోసం ఉద్యోగులు మంత్రులు కేటీఆర్, హరీశ్రావును కలిశారు. దీంతో బీఆర్ఎస్ కూడా మేనిఫెస్టోలో పెట్టనున్నట్లు తెలుస్తోంది.