మున్సి పల్ ఎన్నికల్లో కాంగ్రెస్ దే విజయం..బీఆర్ఎస్ కు అభ్యర్థులు దొరకడం లేదు: మహేశ్ గౌడ్

మున్సి పల్ ఎన్నికల్లో  కాంగ్రెస్ దే విజయం..బీఆర్ఎస్ కు అభ్యర్థులు దొరకడం లేదు: మహేశ్ గౌడ్
  •     కేటీఆర్​వి సోషల్ మీడియా రాజకీయాలు
  •     మీనాక్షి నటరాజన్ మార్పు ప్రచారంలో నిజం లేదు
  •     ఢిల్లీలోని తెలంగాణ భవన్​లో పీసీసీ చీఫ్ చిట్ చాట్

న్యూఢిల్లీ, వెలుగు: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు.. నల్లేరుపై నడకేనని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. మెజార్టీ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని తెలిపారు. పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్​కు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరకడం లేదని ఎద్దేవా చేశారు. ఆ పార్టీ ప్రస్తుతం అంపశయ్యపై కొట్టుమిట్టాడుతున్నదని చెప్పారు. నిజామాబాద్​లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులు భయపడుతున్నారని అన్నారు. 

కనీసం డిపాజిట్లు కూడా దక్కవేమో అని ఆందోళన చెందుతున్నట్లు వివరించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న మహేశ్ గౌడ్.. మంగళవారం తెలంగాణభవన్​లోని శబరి బ్లాక్​లో మీడియాతో చిట్ చాట్ చేశారు. ‘‘పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నేతలు.. ఏ స్థాయిలో దోచుకున్నారో ప్రజలు ఇంకా మరిచిపోలేదు. 

కేటీఆర్ సోషల్ మీడియాను నమ్ముకుని రాజకీయం చేస్తున్నారు. అది ఆయన రాజకీయ అపరిపక్వతకు నిదర్శనం. ప్రజలు పనిని కొలమానంగా చేసుకుని ఓట్లు వేస్తారు. అంతేతప్ప సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలను చూసి ఓట్లు వేయరు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ తిరుగులేని విజయాన్ని అందుకున్నది. మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే జైత్రయాత్ర కొనసాగిస్తది’’అని మహేశ్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. 

కొత్త పార్టీలు ఎన్ని వచ్చినా స్వాగతిస్తాం

బీజేపీ ఎంత ప్రయత్నించినా.. తెలంగాణలో అధికారంలోకి రావడం అసాధ్యమని మహేశ్ గౌడ్ అన్నారు. ‘‘కర్నాటక, తెలంగాణ పరిస్థితులు వేరు. తెలంగాణలో దాదాపు 70 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీకి సరైన అభ్యర్థులే లేరు. తెలంగాణ భౌతిక, సామాజిక పరిస్థితులు బీజేపీకి అనుకూలం కాదు. కవిత రాజకీయ పార్టీని ప్రకటించే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. అయితే, కొత్త పార్టీలు ఎన్ని వచ్చినా స్వాగతిస్తాం. కవిత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం ఆమె వ్యక్తిగత విషయం’’అని మహేశ్ గౌడ్ అన్నారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి అల్లుడే సృజన్ రెడ్డి అని గుర్తు చేశారు. 

‘‘బీఆర్ఎస్ హయాంలో సృజన్ రెడ్డిని అడ్డం పెట్టుకుని ఆ పార్టీ మనీ లాండరింగ్ కు పాల్పడింది. సింగరేణి స్కామ్​కు స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్నీ బీఆర్​ఎస్సే. పదేండ్ల పాలనలో ఆ పార్టీ ఏ స్థాయిలో అవినీతి చేసిందో... కేసీఆర్ కూతురు కవితనే స్వయంగా చెప్పారు. అయితే, నైనీ బొగ్గు టెండర్ల వివాదం పూర్తిగా మీడియా సృష్టే. ఈ అంశంపై అధిష్టానంతో ఎటువంటి చర్చలు జరగలేదు’’అని మహేశ్ గౌడ్ క్లారిటీ ఇచ్చారు.

మంత్రుల మధ్య మంచి సమన్వయం ఉంది

పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రుల విషయంలో ఉద్దేశపూర్వకంగానే కొందరు అసత్యాలను ప్రచారం చేస్తున్నారని మహేశ్ గౌడ్ అన్నారు. ఈ ప్రచారాల్లో వాస్తవం లేదని తెలిపారు. ‘‘మంత్రుల మధ్య మంచి సమన్వయం ఉంది. ఈ అవాస్తవాలను నమ్మొద్దు. జోడెద్దుల మాదిరి ప్రభుత్వం, పార్టీ సమన్వయంతో ముందుకు వెళ్తున్నది. 

అందుకే పంచాయతీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించినం. తెలంగాణ రాజకీయాలను తక్కువ టైంలోనే మీనాక్షి నటరాజన్ అర్థం చేసుకున్నారు. నాకు, సీఎం రేవంత్, మీనాక్షి నటరాజన్​కు మధ్య మంచి సమన్వయం ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేలా పటిష్ట ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నం’’అని మహేశ్ గౌడ్ అన్నారు. 

రాష్ట్రంలో 2 డీసీసీ చీఫ్ ల నియామకం పెండింగ్ లో ఉందని, త్వరలోనే ఆ ప్రాంతాల్లో ఏఐసీసీ అబ్జర్వర్లు మరోసారి పర్యటిస్తారని చెప్పారు. ఆ రిపోర్ట్ ల ఆధారంగా జిల్లా అధ్యక్షుల ప్రకటన ఉంటుందని తెలిపారు. అలాగే, తెలంగాణ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు, బీసీ సహా ఇతర కమ్యూనిటీ అధ్యక్షుల నియామకం, పెండింగ్ లో ఉన్న నామినేటెడ్ పోస్టులు, ఇతర అన్నీ పోస్ట్ లను మున్సిపల్ ఎలక్షన్ తర్వాత భర్తీ చేస్తామని చెప్పారు.