- కేసీఆర్ ఫ్యామిలీ పాపం పండింది
- జైలుకు వెళ్లే రోజులు దగ్గర పడ్డయ్
నిజామాబాద్, వెలుగు: ముందస్తు ఎన్నికల కోసం అసెంబ్లీని రద్దు చేస్తే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన వస్తుందని బీజేపీ ఎంపీ అర్వింద్ ధర్మపురి అన్నారు. ముందస్తుతో పార్టీ వైఫల్యాన్ని మరిపించవచ్చని సీఎం కేసీఆర్ మరో కుట్ర చేస్తున్నాడని, ప్రజలు నమ్మేస్థితిలో లేరని అన్నారు. నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లి మండలంలో మంగళవారం బీజేపీ ‘జనంతోనే మనం’ మహా పాదయాత్రలో ఎంపీ అర్వింద్ పాల్గొని మాట్లాడారు. కేసీఆర్ ఫ్యామిలీ పాపం పండిందని, జైలుకు వెళ్లే రోజులు దగ్గర పడ్డాయన్నారు. అవినీతికి పాల్పడిన వారిని బీజేపీ వదిలిపెట్టదన్నారు. పాలకుల ప్రతి తప్పుకు శిక్ష ఉంటుందన్నారు. కేసీఆర్సర్కార్అన్ని రంగాల్లో విఫలమై ముందస్తుకు వెళ్లేందుకు కుట్ర చేస్తోందన్నారు.
రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలను అధ్యయనం చేసేందుకు బీజేపీ లీడర్లు ప్రజాక్షేత్రంలోకి వెళ్తుతున్నారన్నారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ నేతలు పాదయాత్రలతో ఇంటింటికీ వెళ్తారని అన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ఈనెలాఖారు వరకు ‘జనంతో మనం’ కార్యక్రమం పూర్తవుతుందన్నారు. నియోజకవర్గాల వారీగా ఇంటింటికీ బీజేపీ పేరుతో పాదయాత్ర చేపట్టి రాష్ట్ర కమిటీకి నివేదిక ఇస్తారన్నారు. ఆ రిపోర్టులతో కార్యాచరణ రూపొందిస్తామన్నారు.