బెట్టియా(బిహార్): బిహార్లో ఓటు చోరీ ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఎన్డీయే అనుకుంటోందని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, ఎంపీ ప్రియాంకా గాంధీ అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ‘సర్’ద్వారా మహిళలు సహా 65 లక్షల మంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించారని ఆరోపించారు.
20 ఏండ్ల నితీశ్ పాలనతో బిహార్ ప్రజలు విసిగిపోయారని, అందుకే ఈ ఎన్నికల్లో గెలిచేందుకు ఎన్డీయే ఓట్ చోరీకి పాల్పడుతోందన్నారు. బుధవారం రాష్ట్రంలోని వెస్ట్ చంపారన్ జిల్లాలోని వాల్మీకి నగర్, చాన్పాటియా ప్రాంతాల్లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ప్రియాంక పాల్గొని మాట్లాడారు. ‘‘దేశంలో ప్రస్తుత పరిస్థితి బ్రిటిష్ రాజ్ను తలపిస్తోంది. ప్రతీ వ్యవస్థనూ ఎన్డీయే నాశనం చేస్తోంది.
భవిష్యత్తులో దేశంలో ఎన్నికలు జరుగుతాయా అనే అనుమానం కలుగుతోంది. గతేడాది హర్యానాలో జరిగిన ఎన్నికల్లో కూడా ఓట్ చోరీ జరిగిందని రాహుల్ సాక్ష్యాలతో సహా వివరించారు. మోదీ ప్రభుత్వం ఆదానీ, అంబానీల కోసమే పనిచేస్తోంది. ట్యాక్స్లు, పెట్టుబడి ఖర్చు పెరగడం వల్ల బిహార్లో రైతుల ఆదాయం పెరగట్లేదు. నిరుద్యోగం వెంటాడుతోంది. దీంతో యువత వలస వెళ్లిపోతున్నారు. మా కూటమి అధికారంలోకి వస్తే ప్రతి పేద కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చేలా చూస్తం. పలు శాఖలలో ఖాళీగా ఉన్న లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం”అని చెప్పారు.
