ధన్వాడ బడిలో గుడి నిర్మాణం

ధన్వాడ బడిలో గుడి నిర్మాణం
  •     భక్తిశ్రద్ధలతో సరస్వతీ దేవి విగ్రహ ప్రతిష్ఠాపన

ధన్వాడ, వెలుగు: మహబూబ్​నగర్​ జిల్లా ధన్వాడ మండలకేంద్రంలోని హైస్కూల్​ ఆవరణలో దాతలు, టీచర్ల సహకారంతో సరస్వతీ దేవి ఆలయాన్ని నిర్మించారు. స్కూల్​ ఆవరణలో ఓ చోట సరస్వతీ దేవి విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు చేసేవారు. అక్కడ అమ్మవారి ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించిన స్కూల్​లో పని చేసే టీచర్లు రూ.3 లక్షలతో పాటు సిమెంట్, పునాది, టైల్స్, మెటీరియల్  సమకూర్చారు. 

1991–-92 టెన్త్​ బ్యాచ్​ స్టూడెంట్స్​ అమ్మవారి విగ్రహానికి రూ.75 వేలు అందించారు. హెచ్ఎం రమేశ్​ శెట్టి రూ. 2.02 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఇటీవల ఆలయ నిర్మాణం పూర్తి కావడంతో గురువారం సరస్వతీ దేవి విగ్రహాన్ని వేంకటేశ్వర స్వామి ఆలయం నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం నారాయణపేట శక్తి పీఠ పురోహితులు అమ్మవారికి ధన్యవాసం, జలవాసం, శేయనావాసం చేపట్టారు. శుక్రవారం వేదమంత్రాల నడుమ యజ్ఞం, హోమం పూర్ణాహుతి, విగ్రహ ప్రతిష్ఠాపన నిర్వహించారు. 

అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా హెచ్ఎం రమేశ్​ శెట్టి మాట్లాడుతూ గతంలో అక్షరాభ్యాసం కోసం చిన్న పిల్లలను బాసర వరకు తీసుకెళ్లేవారని, దీనిని దృష్టిలో ఉంచుకొని సరస్వతీ దేవి ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించామని తెలిపారు. స్కూల్​ ఆవరణలో సరస్వతీ దేవి ఆలయాన్ని నిర్మించడం పట్ల మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.