
- జాగలున్నవారికి కొత్తగా 17,057 ఇండ్లు మంజూరు
- పైలట్ ప్రాజెక్ట్ కింద ఇదివరకే 2,762 ఇండ్లు శాంక్షన్
- బేస్మెంట్ పూర్తైన వాటికి పేమెంట్
నిజామాబాద్, వెలుగు : నిజామాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగవంతంగా సాగుతున్నాయి. జనవరిలో పైలట్ ప్రాజెక్ట్ కింద మంజూరైన 2,762 ఇండ్ల నిర్మాణాలు చురుకుగా సాగుతుండగా, కొత్తగా మంజూరైన 17,057 ఇండ్ల నిర్మాణ పనులనూ ప్రారంభించారు. డిసెంబర్నాటికి ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని హౌసింగ్ ఇంజినీర్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే లబ్ధిదారులకు మహిళా సంఘాల ఆధ్వర్యంలో లోన్లు ఇప్పిస్తున్నారు.
3,32,667 అప్లికేషన్లు
2024 జనవరిలో ఇండ్ల కోసం 3,32,667 అప్లికేషన్లు వచ్చాయి. ఒక్కొక్కరు పదేసి అప్లికేషన్లు పెట్టడంతో లబ్ధిదారుల ఎంపిక అధికారులకు తలనొప్పిగా మారింది. ఈ ఏడాది గ్రామసభలు నిర్వహించగా 40,226 మంది ఇండ్ల కోసం దరఖాస్తులు ఇచ్చారు. పూర్తిస్థాయి సర్వే చేసి అర్హులను గుర్తించాలని గ్రామ సెక్రటరీలు, మున్సిపాలిటీ వార్డు ఆఫీసర్లకు ప్రభుత్వం బాధ్యత అప్పగించింది. కూలిపోయే స్థితిలో ఉన్న ఇండ్లు, సొంత జాగల వద్ద ఫొటోలు తీసి అర్హుల లిస్ట్ను ఆన్లైన్లో అప్లోడ్ చేయడంతో అవకతవకలకు తావు లేకుండా పోయింది.
పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపికైన 2,762 ఇండ్లు, సర్వే తర్వాత ఎంపికైన 17,057 ఇండ్లు కలిపి జిల్లాలో మొత్తం 19,819 ఇండ్లు మంజూరయ్యాయి. ప్రతి నియోజకవర్గంలో ఈ ఏడాది 3,500 ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. బోధన్ నియోజకవర్గంలో 3,156 మంది అర్హులను గుర్తించగా, వారందరికీ ఇండ్లు మంజూరయ్యాయి. నిజామాబాద్ రూరల్ సెగ్మెంట్కు 3,299, అర్బన్ సెగ్మెంట్లో 2,752, ఆర్మూర్కు 2,987, బాల్కొండకు 3,324, నిజామాబాద్ జిల్లా పరిధిలోని బాన్సువాడ సెగ్మెంట్లోని మండలాలకు 1,539 ఇండ్లు శాంక్షన్ అయ్యాయి.
ప్రభుత్వ నిబంధనలకు లోబడి పనులు..
ప్రభుత్వ నిబంధనల ప్రకారం 400 నుంచి 600 ఫీట్లకు మించకుండా ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు పోసి పనులు ప్రారంభించారు. వానాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని లబ్ధిదారులకు అందుబాటులో ఉన్న నదులు, కాల్వల నుంచి ఇసుక సరఫరా అయ్యేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.
బేస్మెంట్ పూర్తైనవాటికి పేమెంట్స్..
జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపికైన 2,762 ఇండ్ల బేస్మెంట్లు పూర్తి కావడంతో ప్రభుత్వం లబ్ధిదారులకు రూ.2.65 కోట్లు అందజేసింది. నిర్మాణ దశల ఆధారంగా ఐదు విడతల్లో రూ.5 లక్షలు ఇవ్వనున్నది. డిసెంబర్ నాటికి నిర్మాణాలు పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
పర్యవేక్షణ ముమ్మరం
ఇందిరమ్మ ఇండ్లు త్వరగా పూర్తయ్యేలా పర్యవేక్షణ ముమ్మరం చేశాం. పైలట్ ప్రాజెక్ట్ఇండ్లు స్లాబ్ లెవల్కు చేరాయి. కొత్తగా మంజూరైన వాటికి ముగ్గులు పోసి పనులు ఆగకుండా చూస్తున్నాం. ఈ ఏడాది చివరి నాటికి గృహప్రవేశాలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. - గంగాధర్, హౌసింగ్ డీఈ