కారుపై పడ్డ కంటెయినర్..నలుగురి మృతి

కారుపై  పడ్డ కంటెయినర్..నలుగురి మృతి

జైపూర్: జాతీయ రహదారిపై వెళ్తున్న ఓ భారీ కంటెయినర్ అదే రోడ్డుపై వెళ్తున్న కారును ఓవర్ టేక్ చేస్తుండగా.. అదుపుతప్పి కారుమీద పడిపోయింది. దీంతో కారు నుజ్జునుజ్జు అయిపోగా.. కారులో ప్రయాణిస్తున్న నలుగురు క్షణాల్లో కన్నుమూశారు. శుక్రవారం ఉదయం పాలి జిల్లాలోని గుండోజ్ నుండి సిరోహి వైపు వెళ్లే మార్గంలో  గుడా ఆండ్లా పోలీసు స్టేషన్ పరిధిలోని బాలరాయ్ ప్రాంతంలో జరిగిందీ ప్రమాదం. ఈ ఘటనలో ఓ మహిళతోపాటు.. జోధ్ పూర్ కు చెందిన ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. కారులో ఉన్న దంపతులు అశ్నిదేవ్ ఆయన భార్య రశ్మిదేవ్, మరొకరు అజ్మీర్ మెడికల్ కాలేజీ ఆర్ధిక సలహాదారు మనోజ్ శర్మ, డ్రైవర్ బుద్ధీరామ్ గా గుర్తించారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నా.. కారుపై పడిన కంటెయినర్ ను పక్కకు జరపడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. గతంలో ఎన్నడూ జరగని ఘటన కావడంతో భారీ క్రేన్ ను తెప్పించి అతి కష్టం మీద కంటెయినర్ ను పక్కకు జరిపారు. కారులో ప్రయాణిస్తున్న నలుగురి మృతదేహాలు నుజ్జు నుజ్జు అయ్యాయి.  జిల్లా ఎస్పీ రావత్ ప్రమాద స్థలాన్ని సందర్శించి మృతదేహాల వెలికితీతను పర్యవేక్షించారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం గుండోజ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.