- రెండు సార్లు టెండర్లు పిలిచినా స్పందన లేదు
- మళ్లీ టెండర్ నోటిఫికేషన్ ఇచ్చిన ఇరిగేషన్ శాఖ
హైదరాబాద్, వెలుగు: నాగార్జునసాగర్ స్పిల్ వే రిపేర్ పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకొస్తలేరు. రెండు సార్లు టెండర్లు పిలిచినా ఒక్క కాంట్రాక్టర్ కూడా బిడ్ దాఖలు చేయలేదు. దీంతో ముచ్చటగా మూడోసారి మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చారు. సాగర్ స్పిల్ వే బకెట్ పోర్షన్ రిపేర్లతో పాటు అప్రోచ్ రోడ్డు పనులు చేసేందుకు మే 23న టెండర్ నోటిఫికేషన్ ఇచ్చారు. రూ.16.54 కోట్లతో చేపట్టే ఈ పనులకు జూన్ ఒకటో తేదీలోపు బిడ్లు దాఖలు చేయాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. కాగా, ఇరిగేషన్తో పాటు ఇతర ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ల బిల్లులు భారీగా పెండింగ్లో ఉండటంతో కాంట్రాక్టర్లు ఈ పనులు చేసేందుకు ఆసక్తి చూపించడం లేదు. దీంతో ఈ నెల మొదటి వారంలో మళ్లీ టెండర్లు పిలిచారు. అయినా కాంట్రాక్టర్లు ఆ పనులను పట్టించుకోలేదు. దీంతో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తాజాగా మూడో నోటిఫికేషన్ ఇచ్చింది. సాగర్కు వరద పోటెత్తినప్పుడు గేట్లు ఎత్తితే నీళ్లు సరైన దిశలో కిందకు పడకపోవడంతో స్పిల్ వే బకెట్ పోర్షన్ దెబ్బతింది. బకెట్ పోర్షన్లో ఏర్పడిన భారీ గ్యాప్ను వీలైనంత త్వరగా సరిచేయాలని కేఆర్ఎంబీ సైతం ఇటీవల సూచించింది. డ్యాం సేఫ్టీ ప్యానల్లోని ఎక్స్పర్ట్లు అవే సూచనలు చేయడంతో ప్రభుత్వం ఈ పనులు చేసేందుకు పరిపాలన అనుమతులు ఇచ్చింది. బిల్లులు ఎప్పుడు వస్తాయో తెలియకపోవడం, ఈ పనులు అత్యంత క్లిష్టమైనవి కావడంతోనే కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని తెలుస్తోంది.